పునరుద్ధరణ తర్వాత యాదాద్రికి కోట్లల్లో ఆదాయం

 పునరుద్ధరణ తర్వాత యాదాద్రికి కోట్లల్లో ఆదాయం

తెలంగాణలో తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన యాదాద్రి ఆలయ పునరుద్ధరణ తర్వాత చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేవలం అభివృద్ధిలోనే కాదు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్యతో పాటు, హుండీ ఆదాయం సైతం ఘననీయంగా పెరుగింది. 2022 23లో ఆలయం వార్షిక ఆదాయం రూ.169కోట్లకు చేరుకోవడం చెప్పుకోదగిన విషయం. 2014లో రాష్ట్రం ఆవిర్భవించగా.. ఆ సమయంలో ఇది రూ.61లక్షలు ఉండగా.. ఇప్పుడు ఏకంగా మూడు రెట్టు పెరిగి రికార్డు సృష్టించింది. దర్శన టికెట్లు, నిత్య పూజలు, లడ్డూలు, విరాళాలు, హుండీ సేకరణ, కళ్యాణోత్సవాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు వంటి వాటి ద్వారా రోజూ వారి ఆలయం ఆదాయంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది.

రోజురోజుకూ యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండడం చూడముచ్చటగా ఉందని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గీత ఆనందం వ్యక్తం చేశారు. ఊహించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో రావడం ఆనందాన్నిస్తోందని తెలిపారు. 2021-22లో ఆలయానికి ఏడాదికి దాదాపు73లక్షల మంది వచ్చేవారని, ఆలయ పునరుద్దరణ తర్వాత అనేక సౌకర్యాలు కల్పించడంతో అది 86లక్షలకు చేరుకుందని చెప్పారు. 

ఇక ఆలయ ప్రాంగణాన్ని పునరుద్ధరించానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.1200కోట్లు వెచ్చించింది. నల్ల రాతి శిల్పాలు, బంగారు పూతతో కూడిన గోపురాలు, ఇతర అలంకరణతో పాటు బాహుబలి తలుపులు, భక్తుల కోసం వెయిటింగ్ హాల్స్, లడ్డూ కౌంటర్లు, రోజూ ఆలయానికి 12వేల నుంచి 15వరకు వచ్చే యాత్రికుల అన్న ప్రసాదం కోసం రెండు భోజనశాలలతో పాటు విస్తృతమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 

యాదాద్రికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మామూలు రోజుల్లో 5వేల వరకు యాత్రికులు ఆలయాన్ని సందర్శిస్తున్నారని, వారాంతాల్లో అయితే అది 40వేల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పండుగలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో 50వేలు దాటొచ్చని అంటున్నారు. ఇక హైదరాబాద్ కు కేవలం 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రం చాలా మంది యాత్రికులకు వారాంతపు వియార యాత్రగా మారింది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఆలయానికి వచ్చే వారి సంఖ్యతో పాటు, వార్షిక ఆదాయం సైతం భారీగా పెరుగుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు.