వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాష్‌కు సీబీఐ కోర్టు సమన్లు

వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాష్‌కు సీబీఐ కోర్టు సమన్లు

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 14న కోర్టులో హాజరు కావాలని పేర్కొంటూ సమన్లు ఇచ్చింది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. ఈ మేరకు సమన్లు జారీ చేసింది. అవినాష్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ రెడ్డిపై సీబీఐ ఇప్పటికే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.  వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా సీబీఐ చేర్చింది.

ఈ కేసులో ఆరు, ఏడో నిందితులుగా భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ఏప్రిల్‌ 14న ఉదయ్‌ కుమార్‌రెడ్డిని, 16న భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేశారు. శుక్రవారం (జులై14)  సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు చంచల్‌గూడ జైల్లో ఉన్న నిందితులందరూ హాజరయ్యారు. వారందరికీ ఆగస్టు 14 వరకు కోర్టు రిమాండ్‌ పొడిగించింది. ముందస్తు బెయిల్‌పై ఉన్న అవినాష్‌రెడ్డి ఆగస్టు 14న కోర్టుకు హాజరయ్యే విధంగా చూడాల్సిన బాధ్యతను న్యాయస్థానం.. సీబీఐకే అప్పగించింది.