కృష్ణాజిల్లా గన్నవరం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ హైకోర్టులో మంగళవారం ఎన్నికల పిటిషన్ దాఖలైంది. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘వంశీ ఏప్రిల్లో బాపులపాడు మండలంలోని కనుమోలు తదితర గ్రామాల్లో ప్రచారం చేసినప్పుడు, గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల హామీ ఏమైందంటూ ఓటర్లు నిలదీశారు. దీంతో వంశీ, ఆయన తరఫు ఏజెంట్లు కలిసి ఆ మండల మాజీ తహసీల్దారు పేరుతో సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించి ఓటర్లకు పంపిణీ చేసి.. ఓట్లు సంపాదించుకున్నారు. దీనిపై హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదైంది. ఎన్నికల్లో వంశీ కేవలం 990ఓట్లతో విజయం సాధించారు. కౌంటింగ్లోనూ అక్రమాలకు పాల్పడ్డారు. ప్రజాప్రాతినిథ్య చట్టం, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి గెలుపొందిన వంశీ ఎన్నికను రద్దు చేయాలి’ అని ఆయన పిటిషన్లో తెలిపారు.