- బూడిదే బంగారం!
- సింగరేణి ఎస్టీపీపీకి కాసులు కురిపిస్తున్న ఫ్లైయాష్
- రోజుకు 6,300 టన్నుల ఉత్పత్తి
- ఏటా రూ.7 కోట్ల ఆదాయం
మందమర్రి/జైపూర్, వెలుగు: బూడిద.. ఈ మూడక్షరాల పదం వింటే ఎవరైనా వేస్ట్అంటుంటారు. కానీ దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి ఎస్టీపీపీ మాత్రం బొగ్గు మండించడం ద్వారా వెలువడిన బూడిద(ఫ్లైయాష్)తో అద్భుతాలు సృష్టిస్తోంది. బూడిదతోనూ పలు విధాలుగా ప్రయోగాలు చేసి సంస్థకు ఆదాయం తీసుకురావడంతో పాటు ప్రజలకు చౌకగా సౌకర్యాలు కల్పిస్తోంది. మంచిర్యాల జిల్లాలోని జైపూర్మండలం పెగడపల్లి వద్ద గల సింగరేణి థర్మల్ పవర్ప్లాంట్యాజమాన్యం బూడిద వినియోగంలో మరో అడుగు ముందుకేసింది. ఇది వరకు బొగ్గును తవ్వి తీసిన సింగరేణి బొగ్గు గనుల్లో బూడిదను ఇసుకతో కలిపి పూడికకు ఉపయోగించేది. కొద్ది రోజులుగా బూడిదను లోకల్, ఇతర రాష్ట్రాల్లోని సిమెంట్సంస్థలకు విక్రయిస్తూ ఏటా రూ.7 కోట్ల ఆదాయాన్ని గడిస్తోంది. మరోవైపు స్థానికంగా ఉన్న చిన్న తరహా సిమెంట్ అనుబంధ సంస్థలకు ఫ్లైయాష్ను ఫ్రీగా అందజేస్తూ కాలుష్య నివారణ చర్యల్లో ఆదర్శంగా నిలుస్తోంది.
రెండు రకాల ఫ్లైయాష్
సింగరేణి సంస్థ జైపూర్లోని పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ను 2016 మార్చి 3న, రెండో యూనిట్జూన్1న షురూ చేసింది. ఈ పవర్ప్లాంట్లోని రెండు యూనిట్ల నుంచి రోజుకు 28.08 మిలియన్యూనిట్ల పవర్ను ఉత్పత్తి చేస్తోంది. 162 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్వేల్సబ్స్టేషన్కు గ్రిడ్ద్వారా సరఫరా చేస్తోంది. ప్రతి రోజు సుమారు 16 వేల టన్నుల బొగ్గును వినియోగిస్తోంది. అందులో నుంచి సుమారు 7 వేల టన్నుల బూడిద వెలువడుతోంది. బొగ్గును మండించిన తర్వాత 5.3 మైక్రాన్ల మందంతో ఇసుక రేణువుల మాదిరిగా హాపర్స్ ద్వారా బయటకు వచ్చేది బాటమ్యాష్, బూడిద మాదిరిగా సిలోన్ ద్వారా బయటకు వచ్చేది ఫ్లైయాష్. రోజుకు బాటమ్యాష్ 1,800 టన్నులు, ఫ్లైయాష్ 4,500 టన్నులు వెలువడుతుంది.
బొగ్గు గనుల్లోకి బాటమ్యాష్
సింగరేణి అండర్గ్రౌండ్మైన్స్లో బొగ్గును వెలికి తీసిన తర్వాత ఏర్పడిన ఖాళీ ప్రదేశాలను(స్టవింగ్ సిస్టం) గతంలో ఇసుకతో నింపేవారు. ఇది అధిక ఖర్చుతో కూడుకున్నది. దీంతోపాటు నదిలోని ఇసుకను తీయడం వల్ల గ్రౌండ్ లెవల్ వాటర్ తగ్గుతుండేది. ఈ సమస్యను అధిగమించేందుకు సింగరేణి యాజమాన్యం బూడిదతో స్టవింగ్ చేయడం మొదలుపెట్టింది. సింగరేణి సంస్థ సొంతంగా పవర్ప్లాంటు ఏర్పాటు చేసుకోవడంతో సంస్థకు బాటమ్ యాష్ విరివిగా దొరుకుతోంది. బెల్లంపల్లి, రామగుండం రీజియన్లో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న మైన్స్కు బాటమ్యాష్సరఫరా చేస్తోంది.
ఇతర ప్రయోజనాలు
బొగ్గును మండించిన తర్వాత వచ్చే బూడిద సమీప ప్రాంతాలను కాలుష్య కోరల్లో ముంచుతుంది. అలా వచ్చిన బూడిదను పవర్ ప్లాంట్లో నిల్వ చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ కాలుష్యాన్ని నివారిస్తున్నారు. రోడ్ల నిర్మాణంలో అడుగున వేసేందుకు ఈ బూడిదనే వాడుతున్నారు. సిమెంట్ వినియోగం లేకుండా కేవలం బూడిదతో ‘జియో పాలిమర్రోడ్’ ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లోని దారుల్లో ఏర్పడే గుంతలను పూడ్చడానికి, లోతట్టు ప్రాంతాలను సమతలం చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. స్థానికంగా ఉన్న చిన్న తరహా సిమెంట్అనుబంధ సంస్థకు ఎస్టీపీపీ యాజమాన్యం ఫ్లైయాష్ను ఫ్రీగా సప్లయ్ చేస్తోంది.
సిమెంటు, ఇటుక పరిశ్రమలకు ఫ్లైయాష్
పవర్ ప్లాంట్నుంచి వస్తున్న ఫ్లైయాష్ను ఇటుక, సిమెంట్ తయారీలో వినియోగిస్తున్నారు. దీనికి కాల్షియం కలిపితే సిమెంట్లా పని చేస్తుండటంతో ఈ ఇండస్ర్టీస్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రతి రోజు 4,500 టన్నుల వరకు ఫ్లైయాష్ వెలువడుతోంది. 43 గ్రేడ్ సిమెంట్ లో 30 శాతం, 53 గ్రేడ్ సిమెంట్లో 10 శాతం బూడిదను కలుపుతున్నారు. కరీంనగర్, నిజామాబాద్, కాగజ్నగర్, మంచిర్యాల ప్రాంతాల్లోని పలు సిమెంట్పరిశ్రమలకు ఫ్లైయాష్ ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. సిమెంట్ పరిశ్రమలకు టన్నుకు రూ.50, కాంక్రీట్తయారీ సంస్థలు రూ.55 చొప్పున కొంటున్నాయి. సింగరేణి పరిసర ప్రాంతాల్లోని ఇటుకల తయారీ పరిశ్రమలకు బూడిదను తీసుకువెళ్తున్నారు. సింగరేణి సంస్థ కూడా తన అవసరాలకు మట్టి ఇటుకలకు బదులుగా బూడిదతో తయారు చేసిన ఇటుకల్ని వినియోగిస్తోంది. ఫ్లైయాష్, బాటమ్ యాష్అమ్మడం ద్వారా ఎస్టీపీపీకి నెలకు రూ.60 లక్షల వరకు, ఏటా రూ.7 కోట్లకుపైగా ఆదాయం వస్తోందని ప్లాంట్ఆఫీసర్లు పేర్కొంటున్నారు.