
న్యూఢిల్లీ: యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ ప్రశాంత్ కుమార్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ 6 నుంచి ఇది అమలులోకి వస్తుంది. యెస్ బ్యాంక్ కొత్త ఎండీ, సీఈఓ కోసం వెతుకుతోంది. కొత్త సీఈఓ దొరికేంతవరకు ప్రశాంత్ కుమార్ ఈ పదవిలో కొనసాగనున్నారు.
యెస్ బ్యాంక్ రీస్ట్రక్చరింగ్ టైమ్లో అంటే మార్చి 2020లో ఆర్బీఐ, గవర్నమెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో సహా బ్యాంకుల కన్సార్టియం కుమార్ను సీఈఓగా నియమించింది. యెస్ బ్యాంక్కు రాకముందు ఆయన ఎస్బీఐలో డిప్యూటీ ఎండీ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన పదవీకాలాన్ని అక్టోబర్ 2022లో మొదటిసారిగా పొడిగించారు.
ఈ పొడిగించిన కాలం ఈ ఏడాది అక్టోబర్తో ముగుస్తుంది. తాజాగా మరో ఆరు నెలల పాటు పదవీకాలాన్ని పెంచారు. కాగా, సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ యెస్ బ్యాంకులోని 20 శాతం వాటాను ఎస్బీఐ, ఇతర బ్యాంకుల నుంచి రూ.13 వేల కోట్లకు కొనుగోలు చేయనుంది. ఈ కంపెనీ కొత్త ఎండీ, సీఈఓ కోసం చూస్తోందని రిపోర్టులు వెలువడ్డాయి. యెస్ బ్యాంక్ కొత్త సీఈఓ కోసం వెతుకుతున్న రెండో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఎండీ, సీఈఓ సుమంత్ కథ్పాలియా రాజీనామా తర్వాత కొత్త సీఈఓ కోసం వెతుకుతోంది.