ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని నిర్ణయించింది. 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి.. రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన శనివారం లక్నోలోని లోక్భవన్లో తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో పై నిర్ణయం తీసుకున్నారు. యూపీలో మూడు నెలల పాటు ఉచిత రేషన్ ఇస్తామని, పేదలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కొత్తగా ఎంపికైన డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను పేద ప్రజలకు చేరవేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్లోని మొత్తం 403 నియోజకవర్గాలకు గాను 255 స్థానాల్లో విజయం సాధించి 41.29 శాతం ఓట్లతో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ ముఖ్యమంత్రులు, నితీష్ కుమార్ తదితరుల సమక్షంలో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 52 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. యూపీ ఎన్నికల్లో ఓడిపోయిన కేశవ్ ప్రసాద్ మౌర్య మరోసారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరో మాజీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ స్థానంలో బ్రాహ్మణ నాయకుడు బ్రజేష్ పాఠక్ని ఉపముఖ్యమంత్రిగా ఎంపికచేశారు.
For More News..