- యంగ్ ఇన్వెస్టర్ల జోరు
- ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 102 శాతం పెరిగిన 18–20 ఏజ్ వాళ్లు..
- ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్లు 94 శాతం అప్
- చిన్న సిటీల నుంచి పెరుగుతున్న ఇన్వెస్టర్లు
బిజినెస్డెస్క్, వెలుగు: స్టాక్ మార్కెట్లో యంగ్ ఇన్వెస్టర్ల జోరు పెరుగుతోంది. 18–30 ఏళ్ల వయసున్న ఇన్వెస్టర్లు డబ్బులు సంపాదించడానికి స్టాక్ మార్కెట్లే బెటర్ అని భావిస్తున్నారు. ఆన్లైన్ బ్రోకరేజి కంపెనీ గ్రో విడుదల చేసిన డేటా ప్రకారం, స్టాక్ మార్కెట్లో ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్లు, ముఖ్యంగా యంగ్ ఇన్వెస్టర్లు భారీగా పెరిగారు. కిందటేడాది మొదటి ఏడు నెలలతో పోలిస్తే ఈ ఏడాది మార్కెట్లోకి ఎంటర్ అయిన ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్లు 94.53 శాతం పెరిగారు. ‘18–20 ఏళ్ల వయసున్న ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్లు కిందటేడాది 226.12 శాతం పెరిగారు. ఈ ఏడాది జనవరి– జూలై మధ్య 101.65 శాతం ఎగిశారు. ఇంకా మార్కెట్లోకి వస్తూనే ఉన్నారు. మిగిలిన అన్ని ఏజ్ గ్రూప్లతో పోల్చుకుంటే, 18–20 ఏజ్ గ్రూప్ నుంచి ఇన్వెస్టర్లు వేగంగా యాడ్ అవుతున్నారు. మిలినియల్స్ (ఏజ్ 25–40 ), యంగ్ ఇన్వెస్టర్లు డబ్బులు సంపాదించడానికి స్టాక్ మార్కెట్ల వైపు చూస్తున్నారని తెలుస్తోంది’ అని గ్రో పేర్కొంది. తమ కస్టమర్ల బేస్ కూడా 1.5 కోట్లను క్రాస్ చేసిందని కంపెనీ చెబుతోంది. ఇందులో 2.5 లక్షల మంది కస్టమర్లు ప్రతీ నెల సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) కడుతున్నారని పేర్కొంది. కిందటేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్య గ్రో కస్టమర్లు 70 లక్షలు పెరిగారు. ఇందులో 60 శాతం మంది టైర్ 2 సిటీల నుంచే ఉన్నారని కంపెనీ ప్రకటించింది. కరోనా వలన కిందటేడాది మార్చిలో మార్కెట్లు భారీగా క్రాష్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి మార్కెట్లో రిటెయిల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెరుగుతూ వస్తోంది. టెక్నాలజీ సాయం వలన స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీగా మారిపోయింది. ఆన్లైన్ డీమాట్ అకౌంట్లను ఐదు నిమిషాల్లోనే ఓపెన్ చేయగలుతున్నాం. ఈ ఏడాది జూన్ నాటికి బీఎస్ఈ రిజిస్టర్డ్ యూజర్లు ఏడు కోట్ల మార్క్ను క్రాస్ చేయడం తెలిసిందే. ఆరు కోట్ల నుంచి ఏడు కోట్ల మార్క్ను కేవలం 139 రోజుల్లోనే బీఎస్ఈ చేరుకోగలిగింది. ఐదు నుంచి ఆరు కోట్లకు 241 రోజులను, నాలుగు నుంచి ఐదు కోట్లకు 652 రోజులను ఈ ఎక్స్చేంజ్ తీసుకొంది. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం, ఈక్విటీల్లో రిటెయిల్ ఇన్వెస్టర్ల వాటా 2020–21 లో 45 శాతానికి పెరిగింది.
చిన్న సిటీల నుంచి పెరుగుతున్నారు..
కేవలం గ్రో మాత్రమే కాదు అప్స్టాక్స్, ఏంజెల్ బ్రోకింగ్ వంటి ఆన్లైన్ బ్రోకింగ్ కంపెనీల కస్టమర్లు కూడా పెరుగుతున్నారు. ఇందులో కూడా టైర్ 2, టైర్ 3 సిటీల నుంచి రిజిస్టర్ అవుతున్న కస్టమర్లు ఎక్కువగా ఉన్నారని ఈ కంపెనీలు చెబుతున్నాయి. తమ కస్టమర్ల బేస్లో 80 శాతం మంది 18–36 ఏళ్ల లోపు ఉన్నవారేనని అప్స్టాక్స్ సీఈఓ రవి కుమార్ పేర్కొన్నారు. 70 శాతం మందికి పైగా ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్లే ఉన్నారని చెప్పారు. ‘అన్ని ఏజ్ గ్రూప్ల నుంచి మార్కెట్లో ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. ఖర్చులు తగ్గడం, స్మార్ట్ఫోన్ల వాడకం పెరగడం, ఇంటర్నెట్ స్పీడ్ ఊపందుకోవడం, ట్రేడింగ్ యాప్లు సింపుల్గా రావడం వంటివి దీనికి కారణంగా ఉన్నాయి’ అని కుమార్ అభిప్రాయపడ్డారు. తమ కస్టమర్ల బేస్లో సుమారు 80 శాతం మంది టైర్ 2, టైర్ 3 సిటీల నుంచే ఉన్నారని అన్నారు. ఏంజెల్ బ్రోకింగ్ కస్టమర్ల బేస్ ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–21 లో 4.2 రెట్లు పెరిగిందని ఏంజెల్ బ్రోకింగ్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ప్రభాకర్ తివారి అన్నారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో 24 లక్షల మంది కస్టమర్లను యాడ్ చేసుకోగలిగామని చెప్పారు. ‘టైర్ 2, టైర్ 3 సిటీలలోని ప్రజలను చేరుకోవడానికి అవకాశం దొరుకుతోంది. వీరు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు బ్యాంకు సేవింగ్స్, డిపాజిట్లపై దృష్టి పెట్టిన టైర్ 2, 3 సిటీల ఇన్వెస్టర్లు ఇప్పుడు స్టాక్స్ వైపు చూస్తున్నారు’ అని తివారి అన్నారు.
సగటున 30 ఏళ్ల వయసున్న ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ మార్కెట్లో పెరుగుతోంది. మా కస్టమర్ల బేస్ ప్రస్తుతం 10 వేలకు చేరుకుంది. ఏడాదిన్నర కాలంలో సుమారు 2,000 మంది కొత్త ఇన్వెస్టర్లను యాడ్ చేసుకోగలిగాం. ల్యాండ్, గోల్డ్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బులుండాలి. అదే స్టాక్ మార్కెట్లో రూ. 1,000 నుంచే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ట్యాక్స్ కూడా తక్కువగా ఉంటుంది. బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి యంగ్ ఇన్వెస్టర్లు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడంతో మార్కెట్లో యంగ్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెరుగుతోంది. భవిష్యత్లో కూడా ఈ ట్రెండ్ ఇలానే కొనసాగుతుంది.
- ఆర్ఎంసీవీ ప్రసాదరావు, ఆర్ఎల్పీ సెక్యూరిటీస్ ఎండీ