భద్రాద్రి జిల్లా-- ఇంట్లో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తెలిస్తే చాలు..కొంత మంది చిన్న చూపు చూస్తున్నారు. ఇక కరోనాతో చనిపోతే కనీసం చివరి చూపులకు కూడా రావడంలేదు. అంతిమయాత్రలకు ఆమడ దూరంలో ఉంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. కానీ ఓ యువకుడు కరోనాతో చనిపోయిన శవాలను ఫ్రీగా స్మశానానికి తరలిస్తూ మానవత్వం చాటుకుంటున్నాడు. భద్రాద్రి జిల్లా మణుగూరుకు చెందిన రామాంజనేయులు(26) ఇటీవలే ఐటీఐ పూర్తి చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో సొంతంగా చిన్న వ్యాను కొనుగోలు చేసి, సిమెంట్ ఇతర వస్తువులు రవాణా చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. అయితే ఎక్కడైనా కరోనా శవాలు కనిపిస్తే చాలు ఫ్రీగా స్మశానానికి తరలిస్తూ మానవత్వం చాటుకుంటున్నాడు ఈ యువకుడు. ఈ కష్ట సమయంలో తన వంతు సాయం చేస్తున్నానని చెబుతున్నాడు. అంబులెన్స్ లు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఛార్జ్ చేస్తుంటే ..రామాంజనేయులు మాత్రం ఫ్రీగా సేవలందిస్తున్నాడని స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనా కష్ట సమయంలో వీలైతే ఇలాంటి మంచి పనులు చేయాలి కానీ.. అంటరాని వారిగా హేళన చేయకూడదంటున్నారు.