- సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఘటన
- ముగ్గురూ అనాథలే..
- అధికారుల హామీతో కిందికి..
బెజ్జంకి, వెలుగు : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో అనాథాశ్రమం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు అనాథ యువకులు గురువారం తసెల్ టవర్ ఎక్కారు. చివరకు అధికారులు నచ్చజెప్పడంతో కిందికి దిగారు. టవర్ఎక్కిన గన్నవరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన బావాండ్ల రాజు, జంగాపల్లి గ్రామానికి చెందిన మహంకాళి ప్రశాంత్, కొంకటి వేణు మాట్లాడుతూ.. తాము అనాథలమని, తమలాంటి వారికోసం బెజ్జంకిలో అనాథాశ్రమం ఏర్పాటు చేయాలని కోరారు.
సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలకు మధ్యలో బెజ్జంకి ఉంటుందని ఇక్కడ అనాథశ్రమం ఏర్పాటు చేస్తే రెండు జిల్లాల అనాథలు, వృద్ధులకు సాయం చేసినట్లవుతుందన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో లక్ష్మప్ప, హెడ్ కానిస్టేబుల్ కనకయ్య, సంతోష్ సంఘటన స్థలానికి వచ్చి దిగి రావాలని కోరారు. మంత్రి సీతక్క వచ్చేంతవరకు టవర్ దిగేది లేదని స్పష్టం చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ, సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చేస్తామని నచ్చజెప్పడంతో దిగివచ్చారు.