అదనపు కట్నం వేధింపులు.. శంకరపట్నం మండలంలో మహిళ సూసైడ్‌‌

అదనపు కట్నం వేధింపులు.. శంకరపట్నం మండలంలో మహిళ సూసైడ్‌‌

శంకరపట్నం, వెలుగు : అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు భరించలేక ఓ మహిళ సూసైడ్‌‌ చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్‌‌ జిల్లా శంకరపట్నం మండలం చింతగుట్ట గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లికి చెందిన జిగుర్ల లక్ష్మీపరశురాములు కూతురు నవ్య (23)కు కరీంనగర్‌‌ జిల్లా శంకరపట్నం మండలం చింతగుట్ట గ్రామానికి చెందిన ఆడేపు సమ్మయ్య కుమారుడు సందీప్‌‌తో 2021లో వివాహమైంది. వివాహ సమయంలో అన్ని లాంఛనాలతో పాటు రూ. లక్ష కట్నం ఇచ్చారు.

 మొదటి కుమారుడు పుట్టిన సమయంలో నవ్య పుట్టింటి వారు అదనంగా రూ. 50 వేలు ఇవ్వగా.. తొమ్మిది నెలల కింద మరో బాబు జన్మించగా అప్పుడు కూడా కొంత నగదు ఇచ్చారు. అయినా మరో రూ. 2 లక్షలు తీసుకురావాలంటూ నవ్యను మూడు నెలలుగా ఆమె భర్త సందీప్‌‌, అత్తామామలు కళ, సమ్మయ్య వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగినా వారు వేధింపులు మానుకోలేదు. వేధింపులు భరించలేని నవ్య శనివారం ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌‌ హాస్పిటల్‌‌కు తరలించగా... పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవి తెలిపారు.