కరోనా తర్వాత కాంట్రాక్ట్ జాబ్సే మేలంటున్న యువత

కరోనా తర్వాత కాంట్రాక్ట్ జాబ్సే మేలంటున్న యువత
  • కాంట్రాక్ట్ జాబే.. సో బెటర్
  • కరోనా తర్వాత పెరిగిన అవకాశాలు
  • 6 నెలలు, ఏడాది వర్క్​ కోసం హైర్ చేసుకుంటున్న కంపెనీలు 
  • సిటీలో  24 శాతం డిమాండ్​ 
  • ‘ప్లేస్ టెక్ ఫైండర్ సంస్థ’ సర్వే రిపోర్ట్​

హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్ట్ జాబ్స్ కు క్రేజ్ పెరుగుతోంది.   చాలామంది జాబ్ సెక్యూరిటీ ఉండాలని, లాంగ్ టైమ్ లైఫ్ తో  పాటు గ్రోత్ ఉండే జాబ్స్ కోసం చూస్తుంటారు. కానీ కరోనా తర్వాత ట్రెండ్ మారింది. 6 నెలలు, ఏడాది పాటు కాంట్రాక్ట్ బేసిస్ లో పని చేసేందుకే చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇందులో శాలరీ కూడా బాగానే ఉంటోంది. నెలకు రూ.25 వేల నుంచి 30 వేల వరకు  వస్తుండడంతో కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కు డిమాండ్ పెరుగుతోంది. ఐటీ కంపెనీలకు ఈ పద్ధతి ద్వారా ఖర్చు కలిసివస్తోంది. దీంతో అటు ఎంప్లాయీస్, ఇటు ఐటీ కంపెనీలు కాంట్రాక్ట్ బేసిస్ జాబ్​లకు  ఓకే చెబుతున్నారు. హైదరాబాద్ లో  ఇలాంటి విధానానికి 24 శాతం డిమాండ్ ఉన్నట్లు ‘ప్లేస్ టెక్ ఫైండర్’ సంస్థ సర్వే లో తేలింది.

జాబర్స్​కు మేలే

కాంట్రాక్ట్ బేస్ జాబ్స్ కు లాక్ డౌన్ తర్వాతే డిమాండ్ మొదలైంది. ఈ టైమ్ లో చాలా మంది జాబ్స్ కోల్పోయి నెలలుగా ఖాళీగా ఉన్నారు. వీరంతా అర్జెంటుగా ఏదో ఓ జాబ్​లో జాయిన్ అయిపోవాలని భావించి కాంట్రాక్ట్ బేసిస్   చేరడం స్టార్ట్ చేశారు. గతంలో ఇలాంటి జాబ్​లపై ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్​ చూపలేదు. ప్రస్తుతం 6 నెలల నుంచి ఏడాది వరకైతే జాబ్ గ్యారంటీ ఉండడంతో ప్రస్తుతానికి వెంటనే జాబ్​లో చేరుతున్నారు. సాధారణంగా కొత్తగా చేరిన వారికి గానీ జాబ్ కోల్పోయిన వారికి గానీ శాలరీ ఎక్కువగా ఉండే జాబ్స్ రావడం కష్టం. కాంట్రాక్ట్ బేసిస్ లో మంచి శాలరీ వస్తుండడంతో ఏడాది పాటు జాబ్ చేసినా సరే మరో ఆరు నెలలు ఖాళీగా ఉన్న సరిపోయే విధంగా జీతం ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మరో ఆరు నెలల లోపు కొత్త జాబ్ వెతుక్కోవచ్చని భావిస్తున్నారు.

ఐటీ కంపెనీలకు బెనిఫిట్

కాంట్రాక్ట్ బేస్ జాబ్స్ లో ఐటీ కంపెనీలకు మంచి బెనిఫిట్ అవుతోంది. ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఎంప్లాయ్​లను రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటోంది. ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత కొత్త ప్రాజెక్ట్ వచ్చే వరకు శాలరీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా కాంట్రాక్ట్ బేసిస్ లో శాలరీ తక్కువగా ఇవ్వొచ్చు. లాక్ డౌన్ లో జాబ్​లు తీసేసిన కంపెనీలు, సిబ్బందిని తగ్గించిన సంస్థలు మళ్లీ కొత్త ఎంప్లాయీస్​ వేటలో పడ్డాయి. జస్ట్ ఎన్ని రోజుల ప్రాజెక్ట్ ఉంటుందో అన్ని రోజుల కోసం ముందే కాంట్రాక్ట్ చేసుకుంటున్నాయి. పర్మినెంట్ జాబ్​లను తగ్గించుకుంటున్నాయి. యాప్ లు, వెబ్ సెట్ లు ఆన్ లైన్ బేస్డ్ గా పనిచేసే సంస్థలు కూడా తమ సీజన్ ను బట్టి ఎంప్లాయీస్​ను రిక్రూట్ చేసుకుంటున్నాయి.

బిగ్ ఛేంజర్

మార్కెట్ లో లాంగ్ టర్మ్,  టైమ్ బేస్డ్, టెంపరరీ, టాస్క్ బేస్డ్ వర్క్ వంటి విధానాలు ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్కెట్ మారుతూనే ఉంది. లాక్ డౌన్ తర్వాత ఎంప్లాయీస్ మార్కెట్ ఎలా ఉంటుందని మేము సర్వే కండెక్ట్ చేశాం. అందులో కాంట్రాక్ట్​వల్ జాబ్స్ కే ఎక్కువ  ప్రయారిటీ అని తేలింది. ఎంప్లాయీస్ కూడా ఈ విధానం పట్ల ఇంట్రెస్టెడ్ గానే ఉన్నారు. ఇప్పుడు ఈ  కొత్తగా వచ్చిన మార్పులు లీడింగ్ ఆర్గనైజేషన్స్ అమలు చేస్తున్నాయి.

‑ ప్రవీణ్ మదిరే, టెక్ ఫైండర్ ఫౌండర్ అండ్ సీఈవో

సాఫ్ట్ వేర్ డెవలపర్ గా..

లాక్ డౌన్ లో జాబ్ పోయింది. మళ్లీ జాబ్ కోసం ట్రై చేస్తుండగా యూఎస్ బేస్డ్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. 6 నెలల కాంట్రాక్ట్ తో జాబ్ లోకి తీసుకుంటామన్నారు. మంచి శాలరీ ఆఫర్ చేశారు. దీంతో వెంటనే ఓకే చెప్పా. ఆరు నెలల లోపు మళ్లీ కొత్త జాబ్ ట్రై చేస్తా. లేదంటే ఇలాగే కాంట్రాక్ట్ జాబ్స్ ను కంటిన్యూ చేస్తా.

‑ భార్గవ్, సాప్ట్ వేర్ డెవలపర్, ఎస్ ఆర్ నగర్