మెదక్ లో ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్‌‌తో అప్పులపాలై యువకుడు సూసైడ్

మెదక్ లో ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్‌‌తో అప్పులపాలై యువకుడు సూసైడ్

మెదక్, వెలుగు : ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్‌‌ కారణంగా అప్పులపాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్‌‌ పట్టణంలో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని దుర్గా కాలనీకి చెందిన గంజి దిలీప్‌‌కుమార్‌‌ (29) పెయింటర్‌‌గా పనిచేసేవాడు. ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్‌‌లకు అలవాటు పడడంతో రూ. 2 లక్షల వరకు అప్పు చేశాడు. బెట్టింగ్‌‌లో నష్టపోవడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలో గత నెల 31న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన దిలీప్‌‌కుమార్‌‌ తిరిగి రాలేదు. సోమవారం పట్టణ శివారులోని గోసముద్రం చెరువులో డెడ్‌‌బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి డెడ్‌‌బాడీని బయటకు తీసి, ఎంక్వైరీ చేపట్టగా దిలీప్‌‌కుమార్‌‌గా తేలింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.