
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టులో సంగమేశ్వరం లిఫ్ట్ ను నిర్మిస్తామని.. కృష్ణా నీళ్లను రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలిస్తామని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తోడుతామని, రోజుకు మూడు టీఎంసీల చొప్పున తరలిస్తామని చెప్పారు.. గత ఏడాదే ఎన్నడూ లేనంతగా రాయలసీమ ప్రాజెక్టుల్లో నీటిని నింపుకోగలిగామన్నారు. మంగళవారం ఏపీలోని అమరావతిలో నిర్వహించిన ‘మన పాలన.. మీ సూచన’ కార్యక్రమంలో అధికారులు, రైతులతో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి నీళ్ల వినియోగంపై తమ విధానాన్ని ప్రకటించారు.
రోజూ మూడు టీఎంసీలు తీసుకుంటాం
కృష్ణా నది నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు రావడం లేదని ఏపీ సీఎం జగన్ అన్నారు. ‘‘శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులు డ్రా చేసే పరిస్థితి ఉంటుంది.లెవల్ 854 అడుగులకు పడిపోతే 7 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. మరోవైపు కర్నాటక ఆల్మట్టి ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతోంది. రెండు వైపులా ప్రాజెక్టులు కడుతుండటంతో ఏపీకి 10, 12 రోజులకు మించి వరద వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ అన్ని లిఫ్ట్ ప్రాజెక్టులను 800 అడుగుల ఎత్తులోనే చేపట్టింది. శ్రీశైలంలో నీటి మట్టం 796 అడుగులకు చేరగానే కరెంట్ ఉత్పత్తి ప్రారంభిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీశైలంలో 800 అడుగుల ఎత్తులోనే పంపులు పెట్టి మూడు టీఎంసీలు డ్రా చేస్తం..” అని చెప్పారు. తమ ప్రాజెక్టుతో ఎవరికీ కష్టం, నష్టం ఉండబోదన్నారు.
గోదావరి నుంచీ నీళ్లు తరలిస్తాం
రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు కింద రూ.27 వేల కోట్లతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గోదావరి నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని జగన్ తెలిపారు. పోలవరం కుడి కాల్వ కెపాసిటీని 17,500 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచుతున్నామన్నారు. ఆ నీటిని ప్రకాశం బ్యారేజీ మీదుగా శ్రీశైలంలో కలిపి రాయలసీమకు తరలిస్తామని.. త్వరలోనే ఆ పనులకు టెండర్లు పిలుస్తామని వివరించారు. 12 ఏండ్ల తర్వాత గత ఏడాది కృష్ణా నదికి భారీగా వరదలు వచ్చాయని.. గతంలో ఎప్పుడూ లేనంతగా రాయలసీమ ప్రాజెక్టుల్లో నీటిని నింపుకోగలిగామని తెలిపారు. పులిచింతలలో 45.77 టీఎంసీలు, సోమశిలలో 78 టీఎంసీలు, కండలేరులో 59.75 టీఎంసీలను నీళ్లు నింపామన్నారు.
పోతిరెడ్డిపాడుపై వైఎస్ ను తప్పుపట్టిన కేటీఆర్..జగన్ ప్లా న్ పై సైలెంట్