- కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆంధ్రలో ఆయన కొడుకు జగన్.. తెలంగాణలో ఆయన కూతురు షర్మిల వాడుకుని ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేష్ గౌడ్ మాట్లాడుతూ తన తండ్రి వైఎస్ మరణంపై వైఎస్ షర్మిల చేస్తున్నవ్యాఖ్యలు అయోమయానికి గురిచేసేలా ఉన్నాయన్నారు. సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని చివరి వరకు అభిమానించిన వ్యక్తి వైఎస్ అన్నారు. మరణానంతరం వైఎస్ లెగసీని ఆంధ్రలో కొడుకు జగన్.. తెలంగాణలో కూతురు షర్మిల రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ను వ్యతిరేకించే కొన్ని శక్తులు షర్మిల చేత ఇలాంటి కామెంట్స్ చేయించాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.