సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫైరయ్యారు. ఓట్ల కోసం లక్ష సాయమంటూ కేసీఆర్ నయా వంచనకు తెరలేపాడని ఆరోపించారు. ఇప్పటికే దళితబంధు పేరుతో దళితులను ,గిరిజనబంధు అంటూ ఊరించి గిరిజనులను కేసీఆర్ దగా చేశాడని చెప్పారు. ఇప్పుడు బీసీలను మోసం చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యాడని ఆరోపణలు గుప్పించారు.
9 ఏళ్లుగా బీసీలకు కేటాయించిన నిధులను కేసీఆర్ పక్కదారి పట్టించాడని, బీసీలకు 55వేల కోట్ల బడ్జెట్ అని చెప్పడమే కాని రూపాయి ఇచ్చింది లేదన్నారు షర్మిల. స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేదని చెప్పారు. బీసీ బిడ్డలకు 3 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదన్నారు. ఐదేండ్ల కింద హామీ ఇచ్చిన బీసీ సబ్ ప్లాన్ అటకెక్కిందని షర్మిల చెప్పారు.
ఇక మంత్రివర్గంలో బీసీలకు తగిన ప్రాధాన్యతే లేదన్నారు షర్మిల. బీసీల కుల గణన అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ .. కేసీఆర్ తెర చాటున కేంద్రంతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. బీసీ బిడ్డలు బర్లు, గొర్లు కాచుకోవాలె.. చేపలు పట్టుకోవాలె.. కేసీఆర్ కుటుంబం మాత్రం రాజ్యాలు ఏలాల్నా అని షర్మిల ప్రశ్ని్ంచారు. ఇన్నాళ్లు బీసీలంటే చిన్నచూపు చూసిన కేసీఆర్ కు.. అసెంబ్లీ ఎన్నికల్లో 60 లక్షల బీసీ కుటుంబాలు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నాయని షర్మిల తెలిపారు.