రేపు రాజ్ భవన్ కి వైఎస్ షర్మిల

రేపు రాజ్ భవన్ కి వైఎస్ షర్మిల

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం రాజ్ భవన్ కి వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ తో భేటీ కానున్నారు. తన అరెస్ట్ సహా టీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులు జరిపిన దాడులపై గవర్నర్ కు వివరించనున్నారు. అలాగే తన పాదయాత్రకు సంబంధించిన విషయాలను చర్చించే అవకాశం ఉంది. 

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్‌ షర్మిల అరెస్ట్ సహా అందుకు దారి తీసిన పరిణామాలపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. షర్మిల భద్రత, ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల లోపల ఉండగా, కారును లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కలవరపెట్టినట్లు చెప్పారు. రాజకీయ నేపథ్యం, భావజాలం ఏదైనా కావచ్చు.. మహిళా నాయకులు, మహిళా కార్యకర్తల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరముందని గవర్నర్‌ స్పష్టం చేశారు.

ప్రగతి భవన్ ముట్టడి..షర్మిల అరెస్ట్..బెయిల్

నర్సంపేటలో టీఆర్ఎస్ లీడర్ల దాడి, పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్‌‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రగతి భవన్‌‌ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్‌‌ లీడర్లు ధ్వంసం చేసిన కారును డ్రైవ్‌‌ చేసుకుంటూ వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కారులోంచి దిగకపోవడంతో టోయింగ్‌‌ వెహికల్​ తీసుకువచ్చి కారును ఎస్‌‌ఆర్‌‌ నగర్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌కు లాక్కెళ్లారు. ఈ క్రమంలో పోలీసులను అడ్డుకునేందుకు వైఎస్సార్‌‌టీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. స్టేషన్‌‌లో బలవంతంగా కారు డోర్లు ఓపెన్‌‌ చేసి.. షర్మిల, ఆమె అనుచరులను అరెస్ట్‌‌ చేశారు. మంగళవారం రాత్రి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి బెయిల్ మంజూరు చేశారు.