వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్‌ కల్పిత కథ.. టీడీపీకి మసాలా: సజ్జల

వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్‌ కల్పిత కథ.. టీడీపీకి మసాలా: సజ్జల

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై కొంతమంది  దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.  దర్యాప్తు సంస్థల చరిత్రలో వివేకా హత్య కేసు విచారణ మచ్చుతునక అని సజ్జల వ్యాఖ్యానించారు.  సీబీఐ ఛార్జ్‌షీట్‌లో   కల్పితమైన కథ కనిపిస్తోందన్నారు.  టీడీపీ మసాలాకు  అవసరమైన సరుకుగా ఛార్జ్‌షీట్ ఉపయోగపడుతుందని సజ్జల వ్యాఖ్యానించారు. సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా ఛార్జ్‌‌షీట్ దాఖలు చేసిందో చూస్తున్నామన్నారు. 

 వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇప్పటి వరకు ఆరు, ఏడు స్టేట్‌మెంట్లు ఇచ్చారని.. కొన్ని అంశాలను మాత్రమే తీసుకున్నారని సజ్జల ఆరోపించారు. షమీమ్‌తో రెండో వివాహం గురించి కొత్త ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించి అది కారణం కాదని తేల్చారని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. పొలిటికల్‌గా సూసైడ్ చేసుకోవాలని అవినాష్ రెడ్డి ఎందుకు అనుకుంటారని సజ్జల ప్రశ్నించారు. 

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరు అత్యంత దారుణమని రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలో చంద్రబాబు వైరస్‌లా పాకారని.. వివేకా హత్య వల్ల నష్టం ఎవరికో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని సజ్జల పేర్కొన్నారు. వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగిందని రామకృష్ణారెడ్డి అన్నారు. కథ ఎలా మలుపు తిరగాలో ఆ విధంగా స్టేట్‌మెంట్ వస్తుందని సజ్జల తెలిపారు.  అవినాష్ రెడ్డి సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారని.. తాను, వైఎస్ భారతితో మాట్లాడిన ఫోన్ ఆధారంగాత నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారని ఆయన మండిపడ్డారు. 

వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కల్పిత కథనాలు వున్నాయని సజ్జల ఆరోపించారు.  సునీత చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆయన తెలిపారు. తాను, భారతితో మాట్లాడిన ఫోన్‌ ఆధారంగా నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు కొత్త కథ అల్లారని ఆరోపించారు.  తాను భారతితో కలసి సునీత ఇంటికి వెళ్లలేదని, వివేకా చనిపోయాక కొన్ని రోజులకు తన  భార్యతో కలిసి పరామర్శ కోసం వెళ్లానని సజ్జల చెప్పారు. చనిపోయిన వ్యక్తి గౌరవం కాపాడాలని తాము తపన పడుతుంటే, బతికున్న వారిని బజారుకు ఈడుస్తున్నారని వైఎస్‌ వివేకా కుటుంబ సభ్యులపై మండిపడ్డారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోవడం తమకు షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. వివేకా చనిపోవడానికి రెండు, మూడు రోజుల ముందు నాతో కూడా మాట్లాడారని అన్నారు. చిన్నాన్న గురించి  మాట్లాడవద్దని జగన్‌ ఎన్నికలప్పుడూ చెప్పారన్నారు సజ్జల. వివేకా హత్య వెనుక పది, పన్నెడు కారణాలు కనిపిస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు