నా తండ్రిని చంపినోళ్లతో అవినాష్​కు సంబంధం: సునీత

నా తండ్రిని చంపినోళ్లతో అవినాష్​కు సంబంధం: సునీత

బషీర్ బాగ్, వెలుగు: తన తండ్రి హత్య కేసులో ఐదేండ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని వైఎస్  వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఆమె అన్నారు. హైదరాబాద్  బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తన తండ్రిని చంపిన వారితో అవినాష్  రెడ్డికి సంబంధం ఉందని తెలిపారు.

ఈ కేసులో సీబీఐపై ఒత్తిడి ఉందన్నారు.  నలుగురు నిందితులను సీబీఐ అధికారులు మొదట చార్జిషీటులో చేర్చారని, ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ2 సునీల్ యాదవ్ , ఏ3 ఉమాశంకర్ రెడ్డి, ఏ4 దస్తగిరిగా పేర్కొన్నారని తెలిపారు. వివేకానంద రెడ్డి ఇంటి సమీపంలో ఉమాశంకర్ రెడ్డి పరిగెడుతున్న దృశ్యాలు, హత్య జరిగిన తర్వాత అన్ని మీడియా చానల్స్​లో వచ్చిన వార్తల క్లిప్పింగులు, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను పవర్ పాయింట్ ప్రజంటేషన్​లో వివరించారు. తన తండ్రి హత్య విషయంలో అవినాష్ రెడ్డికి అన్నీ తెలుసన్నారు. హత్యలు చేయించిన వారు చట్టసభల్లో ఉండకూడదనేదే తన తాపత్రయం అని తెలిపారు.