టీఎస్పీఎస్సీ ఆఫీస్ ఎదుట వైఎస్ షర్మిల ధర్నా

టీఎస్పీఎస్సీ ఆఫీస్ ఎదుట వైఎస్ షర్మిల ధర్నా

ఉద్యోగాలు రాకపోవడంతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ లో చలనం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వని ఈ సీఎం మనకొద్దన్నారు. తక్షణం కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లను విడుదల చేయాలని కోరుతూ ఇవాళ మధ్యాహ్నం ఆమె.. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం టీఎస్పీఎస్సీ ఆఫీసు ఎదుటనే ఆమె ధర్నాకు దిగారు. నిరుద్యోగులకు సంఘీభావంగా సాయంత్రం వరకు టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేస్తానని షర్మిల చెప్పారు. 

దళితుడిని సీఎం చేస్తే నిరుద్యోగులకు న్యాయం..

ప్రభుత్వం నియమించిన బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే.. రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి పథకాన్ని కూడా వెంటనే అమలులోకి తేవాలని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని సీఎం బండకట్టుకొని దేనిలోనైనా దూకితే నిరుద్యోగుల నెత్తిన పాలు పోసినట్లేనని అన్నారు. దళితుడిని సీఎం చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ లో చలనం లేదన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య కనిపించే మన సీఎం కేసీఆర్ కు తెలంగాణలోని నిరుద్యోగం కనిపించడం లేదా అని ఆమె నిలదీశారు. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ను అడిగితే ఉద్యోగాల భర్తీపై తమకు ఎలాంటి ఆదేశాలు లేవని చెప్తున్నారంటేనే నిరుద్యోగ సమస్యపై కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ

మేడారం జాతరకు యాప్.. అన్ని వివరాలు ఫోన్​లోనే

వాలంటైన్స్ డే నాడు ఒక్కటైన ట్రాన్స్ జెండర్ జంట