దేవరకద్ర/అడ్డాకుల, వెలుగు : టీఆర్ఎస్ మంత్రులకు సంపాదన మీద ఉన్న ప్రేమ సొంతూళ్ల అభివృద్ధిపై లేదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ సొంతూరు రాచాల గ్రామానికి రోడ్డు కూడా లేదని, మంత్రి అయ్యాక ఆయన తన సొంతూరినే మరిచిపోయారని ఆమె విమర్శించారు. ఆమె చేపట్టిన పాదయాత్ర మంగళవారం నాటికి 150 రోజులకు చేరుకుంది. యాత్ర ఉదయం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కురుమూర్తి మీదుగా దేవరకద్ర మండలంలోని వెంకంపల్లి, వెంకటగిరి, కౌకుంట్ల, ఇస్రంపల్లి, అడ్డాకుల మండలం రాచాలకు చేరుకుంది. ఈ సందర్భంగా రాచాల గ్రామస్తులతో నిర్వహించిన ‘మాట-ముచ్చట’ కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. వలసల జిల్లాగా ఉన్న పాలమూరుకు వైఎస్సార్ హయాంలోనే ప్రాజెక్టులు వచ్చాయని, కేసీఆర్ను రెండుసార్లు సీఎం చేసినా ఆ జిల్లాకు చేసిందేమీ లేదని ఫైరయ్యారు. ‘‘కేసీఆర్వన్నీ మోసపూరిత హామీలే.
రైతుబంధు కింద ఎకరాకు రూ.5 వేలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, సబ్సిడీలు బంద్ పెట్టిండు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్.. 17 వేల పోస్టులే భర్తీ చేసి నిరుద్యోగులను మోసం చేసిండు. బంగారు తెలంగాణను చేస్తానని నమ్మించి, అప్పుల తెలంగాణగా మార్చిండు. ఈ దరిద్రం ఇక్కడితో చాలదన్నట్లు ఢిల్లీకి పోతానని ప్రకటనలు చేస్తున్నడు. బంగారం లాంటి రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక దేశం మీద పడదామనుకుంటున్నడు. ప్రజలు కేసీఆర్ మాటల్ని నమ్మే స్థితిలో లేరు” అని షర్మిల అన్నారు. కాగా రాచాలలో ‘మాట-ముచ్చట’ అనంతరం యాత్ర అడ్డాకుల మండల కేంద్రానికి చేరింది. అక్కడి నుంచే మంగళవారం ఉదయం యాత్ర కొనసాగనుంది.