
సీఎం కేసీఆర్ తన స్వార్థ రాజకీయాలకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి తెలంగాణను నిలువునా ముంచాడని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎంతో మంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రక్తం చిందించి పోరాడి సాధించుకున్న తెలంగాణకు నీళ్ళు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు గడుస్తున్నా.. విభజన హామీల ఊసెత్తడం లేదన్నారు. నీటి వాటాపై మాట్లాడడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష కాబట్టే నోరు విప్పడం లేదా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల పోరాటాన్ని ఆసరాగా చేసుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన సీఎం కేసీఆర్ ..అందిన కాడికి రాష్ట్రాన్ని దోచుకున్నారని షర్మిల ఆరోపించారు. తెలంగాణను అడుగడుగునా కొల్లగొట్టారని మండిపడ్డారు. ఇన్నాళ్లు బీజేపీకి వంత పాడిన కేసీఆర్.. తెలంగాణ సంపదను దోచుకున్నాడని....ఇప్పుడు అదే బీజేపీని తిట్టినట్లు చేసి.. దేశాన్ని కూడా దోచుకుందామని కుట్ర చేస్తున్నారని తెలిపారు. BRS, BJP స్వార్థ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. BJP ముక్త్ భారత్ కావాలి, BRS ముక్త్ తెలంగాణ కావాలని షర్మిల పిలుపునిచ్చారు.