టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రేపటినుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు జీరో టికెట్ తీసుకుని సంస్థకు సహకరించాలని కోరారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్ర స్థాయి అధికారులతో 2023 డిసెంబర్ 14 గురువారం సాయంత్రం ఆయన వర్చువల్ గా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్ కు మహిళల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు సజ్జనార్. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా ఈ పథకం అమలవుతోందని చెప్పారు. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని తెలిపారు. వాటిని కండక్టర్లకు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని తెలిపారు.
ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినిలు, ట్రాన్స్ జెండర్లు ఉపయోగించుకోవాలని సజ్జనార్ తెలిపారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేసి.. అందుబాటులో తీసుకువచ్చిన అధికారులను సజ్జనార్ గారు అభినందించారు.
ఈ సమావేశంలో టీఎస్ఆర్టీసీ సీఓఓ డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) ముని శేఖర్, సిటీఎం జీవన్ ప్రసాద్, సీఈఐటీ రాజశేఖర్, ఐటీ ఏటీఎం రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.