పక్కా ప్లాన్​తోనే మాల్ పై రష్యా దాడి చేసింది

పక్కా ప్లాన్​తోనే  మాల్ పై రష్యా దాడి చేసింది

కీవ్: క్రెమెన్​చుక్​లోని అమ్​స్టర్​ మాల్​పై మిసైల్ దాడులను ఖండించిన ఆ దేశ ప్రెసిడెంట్​ జెలెన్​ స్కీ.. రష్యా మిలటరీని టెర్రరిస్టులతో పోల్చారు. పుతిన్​ ఆర్మీ పిచ్చి పట్టిన టెర్రరిస్టులు అని, వారికి భూమిపై ఉండే హక్కు లేదని మండిపడ్డారు. మాల్​పై మిసైల్ దాడిలో 18 మంది పౌరులు చనిపోయారన్నారు. 60 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. పక్కా ప్లాన్​తోనే రష్యా ఈ దాడి చేసిందని ఆరోపించారు. శాంతియుతంగా ఉన్న నగరంలోని ఓ ఆర్డినరీ మాల్​పై మిసైల్​ ఎటాక్​ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి సమయంలో మాల్​లో మహిళలు, చిన్నారులు, పౌరులు ఉన్నారని తెలిపారు. మాల్​పై అసలు దాడే చేయలేదని రష్యా ప్రకటించిందని, తరువాత తప్పు తెలుసుకుని మాట మార్చిందన్నారు. మాల్​కు సమీపంలోని యూఎస్​ మిలటరీ బేస్​ను టార్గెట్​ చేసుకోగా.. గురి తప్పి మాల్​పై పడిందని యూఎస్​ చెప్పిందని జెలెన్​స్కీ వివరించారు. అయితే క్రెమెన్​చుక్​లో అస్సలు మిలిటరీ క్యాంపులే లేవని, రష్యా కావాలనే మాల్​ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని విమర్శించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, చాలా మంది ఆచూకీ లభించడం లేదన్నారు. సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రజలు ప్రయత్నాలు చేస్తుంటే.. రష్యా మిసైల్స్​తో దాడులు చేస్తోందన్నారు. తమ నుంచి రష్యా సైనికులకు ఎలాంటి ముప్పు లేదని ప్రకటించినా పుతిన్​ వినిపించుకోవడం లేదని తెలిపారు. యూరోపియన్​ చరిత్రలో రష్యా ఉగ్రవాదులు చేసిన అతిపెద్ద దాడిగా విమర్శించారు. ఏడాదిలోపు రష్యాతో యుద్ధం ముగిసేలా చూడాలని జీ-7 దేశాల అధినేతలను జెలెన్​ స్కీ కోరారు. మాల్​పై రష్యా దాడిని జీ–7 దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు.