సింపతీ కోసం మోడీ చీప్‌ ట్రిక్స్

సింపతీ కోసం మోడీ చీప్‌ ట్రిక్స్

ప్రధాని నరేంద్ర మోడీ నిన్న  పంజాబ్ టూర్‌‌లో కావాలని సింపతీ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేశారని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్ తికాయత్ ఆరోపించారు. మోడీ తాను ప్రాణాలతో బయటపడ్డానని చెప్పినట్లు వచ్చిన వార్తలు కచ్చితంగా ప్రజల్లో సింపతీ  కోసం చేసిన స్టంట్ అని అన్నారు. అసలు ప్రధాని.. పంజాబ్‌కు వచ్చే ముందు ఆయన ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లను చేసుకున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 

పంజాబ్‌లోని  ఫిరోజ్‌పూర్‌‌లో సభకు వెళ్లేందుకు ప్రధాని మోడీ బఠిండా ఎయిర్‌‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో వెళ్తుండగా.. రైతులు ఆయన కాన్వాయ్‌ను బ్లాక్ చేశారు. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు ఓ ఫ్లైఓవర్‌‌పై చిక్కుకుపోయిన ప్రధాని.. ఆ తర్వాత సభకు వెళ్లకుండానే ఎయిర్‌‌పోర్టుకు వెనుదిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదన్న ఆగ్రహంతో ప్రధాని మోడీ అక్కడ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ‘‘పంజాబ్‌ సీఎంకు ధన్యవాదాలు.. ప్రాణాలతో ఎయిర్‌‌పోర్టుకు చేరుకున్నానని చెప్పండి” అని ఆయన అధికారులతో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రాకేశ్ తికాయత్ స్పందిస్తూ.. ఈ రకమైన వ్యాఖ్యలు ప్రజల్లో సింపతీ కోసం చేసిన ప్రయత్నమని ఆరోపించారు.

‘‘ప్రధాని మోడీ పర్యటన సమయంలో భద్రతా వైఫల్యం తలెత్తిందని కేంద్రం చెబుతోంది. కానీ ఆయన సభకు జనం రాకపోవడంతోనే మోడీ మధ్యలోనే వెనుదిరిగారని పంజాబ్ సర్కారు ఆరోపిస్తోంది. ఇద్దరూ వాళ్లను వాళ్లు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రధాని మోడీ అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది’’ అని రాకేశ్ తికాయత్ అన్నారు.