మేడిపల్లి, వెలుగు: భారీ వేతనంతో విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ యువకుడి నుంచి మోసగాళ్లు రూ.15.70 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం.. బోడుప్పల్ లెక్చరర్స్ కాలనీకి చెందిన మట్టపల్లి శ్రీకాంత్(30)కు యూకేలో ఉన్న అతని స్నేహితుడి ద్వారా గుల్లకుంట్ల శ్రవణ్ కుమార్, మందెం లావణ్య పరిచయమయ్యారు. ‘డియా టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్’లో సంవత్సరానికి రూ.39 లక్షల వేతనంతో సాఫ్ట్వేర్ టెస్టింగ్ కన్సల్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
ప్రాసెసింగ్ ఫీజు, ఇంటర్వ్యూ, రిక్రూట్మెంట్, వీసా తదితర పేర్లతో విడతల వారీగా బాధితుడి నుంచి రూ.15 లక్షల 70 వేలు వసూలు చేశారు. అనంతరం నకిలీ పత్రాలు పంపించి, వీసా తిరస్కరణ పేరుతో మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. చివరకు ఫోన్ కాల్స్, మెసేజ్లకు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన శ్రీకాంత్ బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
