తుపాకులగూడెం ఖర్చు రూ.1,396 కోట్లు పెంపు

తుపాకులగూడెం ఖర్చు రూ.1,396 కోట్లు పెంపు

మోడికుంటవాగు అంచనా వ్యయం ఆరు రెట్లు పెరిగింది
డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో పేర్కొన్న  ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తుపాకులగూడెం (పీవీ నర్సింహారావు కంతనపల్లి సుజల స్రవంతి) బ్యారేజీ అంచనా వ్యయం రూ.1,396 కోట్లు పెంచారు. ఇటీవల ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ రూపొందించిన ప్రాజెక్టు డీపీఆర్‌‌‌‌‌‌‌‌లో ఎస్కలేషన్‌‌‌‌‌‌‌‌ వివరాలు ప్రస్తావించారు. మోడికుంటవాగు అంచనా వ్యయాన్ని ఏకంగా ఆరు రెట్లు పెంచారు. సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం స్వల్పంగా పెరిగింది. మొత్తం ఆరు ప్రాజెక్టుల డీపీఆర్లు సిద్ధం చేయగా అందులో నాలుగు ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగింది. నాలుగు ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,322 కోట్లు పెంచేశారు.
కంతనపల్లి నుంచి తుపాకులగూడానికి..
తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణానికి 2017లో రూ.2,120 కోట్లతో పరిపాలన అనుమతులిచ్చారు. మొదట కంతనపల్లి వద్ద ప్రతిపాదించిన ఈ బ్యారేజీని ముంపు ఎక్కువగా ఉందని పేర్కొంటూ తుపాకులగూడానికి మార్చారు. ఏడాది క్రితం ఈ బ్యారేజీ పేరు సమ్మక్కసాగర్‌‌‌‌‌‌‌‌గా మార్చారు. నాలుగేండ్లలో ప్రాజెక్టు అంచనాను రూ.1,396 కోట్లు పెంచారు. 2008లో ప్రస్తుత ములుగు జిల్లా వాజేడు మండలంలో రూ.124.60 కోట్లతో మోడికుంటవాగు ప్రాజెక్టు ప్రతిపాదించారు. 2018–19లో దీని అంచనా వ్యయాన్ని రూ.531.77 కోట్లకు పెంచారు. ప్రాజెక్టు తాజా డీపీఆర్‌‌‌‌‌‌‌‌లో నిర్మాణ వ్యయం రూ.700.20 కోట్లుగా పేర్కొన్నారు. చనకా- కొరాటా బ్యారేజీకి 2015లో రూ.368.80 కోట్లతో పరిపాలన అనుమతులిచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రూ.428 కోట్లకు పెంచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇచ్చే సీతారామ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని రూ.13,058 కోట్ల నుంచి రూ.13,384 కోట్లకు పెంచేశారు. ఈ ప్రాజెక్టులో చేపట్టిన అదనపు పనులతో నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశముంది.