- బల్దియాల్లో చివరి రోజు భారీగా నామినేషన్లు
- రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో 467 స్థానాలకు 4,755 నామినేషన్లు
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు 13 మున్సిపాలిటీల్లో చివరి రోజు శుక్రవారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ పార్టీల అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్లుగా పలువురు చివరి నిమిషం వరకు నామినేషన్లు సమర్పించారు. దీంతో బల్దియా ఆఫీసులన్నీ సందడిగా మారాయి. ఈ నెల 28న ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చాలా చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు అధికారికంగా ఖరారు కానప్పటికీ.. టికెట్ వస్తుందనే ఆశతో నామినేషన్ వేశారు.
కొన్ని వార్డులు, డివిజన్లలో ఒక్కరే రెండు, మూడు రాజకీయ పార్టీల పేరుతో, ఇండిపెండెంట్లుగా వేర్వేరు నామినేషన్లు సమర్పించారు. కరీంనగర్(66), రామగుండం(60) మున్సిపల్ కార్పొరేషన్లలోని 126 డివిజన్లతోపాటు చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్, సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథని, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్ పల్లి, రాయికల్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లోని వార్డులు/డివిజన్లు మొత్తం 467 ఉండగా మూడు రోజుల్లో 4,755 నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్లో అత్యధికంగా 1,248 నామినేషన్లు వచ్చాయి. రామగుండంలో 709 నామినేషన్లు వచ్చాయి. మున్సిపాలిటీల్లో అత్యధికంగా జగిత్యాల మున్సిపాలిటీలో 530, సిరిసిల్లలో 449, పెద్దపల్లిలో 339, కోరుట్లలో 337 నామినేషన్లు వచ్చాయి.
నేడు నామినేషన్ల స్క్రూట్నీ..
అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్లు శనివారం పరిశీలించనున్నారు. ఇందులో అర్హత కలిగిన అభ్యర్థులను గుర్తించి జాబితాను విడుదల చేస్తారు. రిజెక్ట్ అయిన అభ్యర్థులు ఆదివారం అప్పీల్ చేసుకునే అవకాశముంది. ఈ అప్పీళ్లను సోమవారం పరిశీలించి పరిష్కరిస్తారు.
బల్దియా డివిజన్లు/వార్డులు నామినేషన్లు
కరీంనగర్ 66 1,248
చొప్పదండి 14 117
జమ్మికుంట 30 341
హజూరాబాద్ 30 304
పెద్దపల్లి 36 339
సుల్తానాబాద్ 15 139
మంథని 13 158
జగిత్యాల 50 530
ధర్మపురి 15 113
కోరుట్ల 33 337
మెట్పల్లి 26 291
రాయికల్ 12 100
సిరిసిల్ల 39 449
వేములవాడ 28 260
రామగుండం 60 709
