- ఐఏఎస్ అధికారి అవినీతికి ఆధారాలు ఎక్కడ..?
- నగదు లావాదేవీల డాక్యుమెంట్ల కోసం సెర్చింగ్
- కీలకంగా మారిన రియల్టర్లు, అధికారుల కాల్డేటా
- ఏసీబీ చరిత్రలో హై ప్రొఫైల్ కేసు, అధికారులకు టాస్క్
హైదరాబాద్,వెలుగు: హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసును ఏసీబీ హై ప్రొఫైల్ గా తీసుకుని దర్యాప్తు చేస్తోంది. ఐఏఎస్ అర్వింద్కుమార్,శివ బాలకృష్ణ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపైనా ఏసీబీ అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. లంచం డబ్బు అంతా నగదుగానే ఇచ్చానని చెప్పగా, వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. శివ బాలకృష్ణ స్టేట్మెంట్కు సపోర్ట్ చేసే డాక్యుమెంట్ ఎవిడెన్స్, కాల్డేటా, వాట్సాప్ చాటింగ్స్, సెల్ఫోన్ టవర్ లొకేషన్స్ సేకరిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్లు, కీలక సాక్షుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడంపై ఫోకస్ పెట్టారు. అర్వింద్ కుమార్,హెచ్ఎండీఏ సెక్రటరీ చంద్రయ్య సహ రియల్ఎస్టేట్ వ్యాపారుల కాల్డేటాను తీసుకుంటున్నారు. అయితే.. అర్వింద్ కుమార్ అవినీతికి పాల్పడ్డారా..? లేదా..? అనేది నిర్ధారించేందుకు పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్పైనే ఏసీబీ ఆధారపడ్డట్లు తెలిసింది.
మిగతా రూ.9 కోట్లు ఎలా చేరవేశాడు.!
శివ బాలకృష్ణ చెప్పిన వివరాల్లో నిజనిజాలు తేల్చేందుకు ఏసీబీ ప్రయత్నిస్తుండగా... నార్సింగిలోని 12 ఎకరాల స్థల వివాద డాక్యుమెంట్లను సేకరించింది. వీటికి సంబంధించి హెచ్ఎండీఏ సెక్రటరీ చంద్రయ్యను ఇప్పటికే విచారించినట్లు తెలిసింది. ఇదే ఇష్యూలో ఉదయ ఎస్ఎస్వీ ప్రాజెక్ట్ ప్రతినిధుల నుంచి అర్వింద్ కుమార్ రూ.10 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు శివ బాలకృష్ణ వాంగ్మూలం ఇచ్చినది తెలిసిందే. ఇందులో రూ. కోటి షేక్ సైదాకు డిసెంబర్లో ఇచ్చాడని పేర్కొన్నాడు. మిగతా రూ.9 కోట్ల వివరాలను వెల్లడించలేదు. శివ బాలకృష్ణ చెప్పినట్లుగా అర్వింద్ కుమార్ కు మొత్తం డబ్బు చేరిందా..? లేక ఇన్వెస్టిగేషన్ను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాడా..? అనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. షేక్సైదా,శివ బాలకృష్ణ కాల్డేటా, వాట్సాప్, సీసీ టీవీల ఫుటేజ్, టవర్ లొకేషన్ డంప్ తీసుకుంటున్నారు.
నగదు ఆధారాలు ఎక్కడ..?
బాచుపల్లిలోని ల్యాండ్ కన్వర్షన్ ఇష్యూకు సంబంధించి క్యూ– మార్ట్ రాహుల్ అనే వ్యక్తి మాసబ్ట్యాంక్లోని రెరా ఆఫీసులో రూ. కోటి ఇచ్చాడని తెలిపాడు. ఈస్ట్ మారేడ్పల్లిలోని మీనాక్షి కంపెనీకి చెందిన లైజనింగ్ ఆఫీసర్ నాగబాబు తనకు రూ.50లక్షలు ఇచ్చాడని తెలిపాడు. కోకాపేట్ హై రైజ్ బిల్డింగ్ ప్రాజెక్ట్లో ప్రెస్టీజ్ గ్రూప్ జనరల్ మేనేజర్ సురేశ్ రూ.40లక్షలు, సలార్ పురియా సత్తవ ప్రాజెక్ట్కు చెందిన అమిత్ సలార్ పురియా రూ.35లక్షలు ఇచ్చాడని శివ బాలకృష్ణ తన వాంగ్మూలంలో చెప్పాడు. ఇలా వసూలు చేసిన మొత్తం డబ్బు అర్వింద్ కుమార్ కు ఆయన ఇంట్లోనే అందించానని శివబాలకృష్ణ వెల్లడించాడు. అయితే.. వీటికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇవ్వలేదని తెలిసింది. ఆన్లైన్ట్రాన్సాక్షన్స్ కూడా లేకపోవడంతో శివబాలకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం నగదు చేతులు మారిన విధానాన్ని ఏసీబీ అధికారులు ధృవీకరించాల్సిన అవసరం ఉంది.
శివ బాలకృష్ణకు బెయిల్ నిరాకరణ
శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసినది తెలిసిందే. బెయిల్ పిటిషన్పై కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. కేసు దర్యాప్తు కీలకదశలో ఉందని ఏసీబీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఈ కేసులో శివ బాలకృష్ణ వాంగ్మూలం ఆధారంగా మరికొంత మందిని విచారించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ సేకరించాలని తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫు వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే చాన్స్ ఉంది.