
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం.. కేవలం 825 అడుగుల ఎత్తుకు మాత్రమే వెళ్లింది. అక్కడి నుంచి పైకి వెళ్లేందుకు పైలెట్లు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఒక్కసారిగా విమానం కిందికి దిగుతూ కుప్పకూలిపోయింది. దీనికి కారణమేమై ఉంటుందని చర్చ జరుగుతున్నది. ప్లేన్ కూలిపోతున్న వీడియోలను విశ్లేషిస్తూ, అది కూలిపోవడానికి పలు కారణాలను నిపుణులు చెబుతున్నారు. విమానం ఇంజిన్లు శక్తిని కోల్పోవడంతోనే ఇలా జరిగి ఉంటుందని పేర్కొంటున్నారు. ఫ్లైట్ను పక్షులు ఢీకొట్టినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
మరోవైపు ఈ ఫ్లైట్లో ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్గా ఉందని, అధిక బరువు కూడా కారణమై ఉండొచ్చని అంటున్నారు. ‘‘ఫ్లైట్ టేకాఫ్ ఫర్ఫెక్ట్గానే జరిగింది. కానీ అది పైకి ఎగరలేకపోయింది. పైకి వెళ్లడానికి బదులు కిందికి వచ్చింది. ఫ్లైట్ ఇంజిన్ పవర్ కోల్పోయినప్పుడే ఇలా జరుగుతుంది. ఏదేమైనా ప్రమాదానికి కారణమేమిటన్నది విచారణలోనే తేలుతుంది” అని మాజీ పైలెట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ తెలిపారు.
రాంగ్ టేకాఫ్, ఇంజిన్లో సమస్య లేదా మరేదైనా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ఏవియేషన్ ఎక్స్పర్ట్ సంజయ్ లాజర్ చెప్పారు. కాగా, అహ్మదాబాద్ ఎయిర్పోర్టు రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నదని.. అక్కడ పక్షులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు.
ఏదైనా పక్షి/పక్షులు ఢీకొట్టడం వల్ల విమానం కూలిపోయి ఉండొచ్చని అంటున్నారు. ఫ్లైట్ ఇంజిన్లు, రెక్కలను పక్షులు ఢీకొడితే ప్రమాదమని పేర్కొంటున్నారు. అలాంటి సందర్భాల్లో ఇంజిన్లు ఫెయిల్ కావడం, రెక్కలు డ్యామేజీ కావడం జరుగుతుందని.. అది ప్లేన్ క్రాష్కు దారితీస్తుందని వివరిస్తున్నారు.
టేకాఫ్ ప్రిపరేషన్ సరిగా లేదా?
ఎయిరిండియా విమానాన్ని టేకాఫ్ కోసం సరిగా సిద్ధం చేయలేదని వీడియోలను బట్టి తెలుస్తున్నదని యూఎస్ ఎక్స్పర్ట్ జాన్ ఎం కాక్స్ పేర్కొన్నారు. ‘‘వీడియోల్లో విమానం ముందు భాగం పైకి వెళ్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, అది మాత్రం కిందపడిపోయింది. అంటే విమానం పైకి ఎగిరేందుకు రెక్కల నుంచి తగినంత సపోర్టు అందలేదు. విమానం రెక్కలకు సంబంధించిన స్లాట్స్, ఫ్లాప్స్ను సరైన పొజిషన్లో ఉంచితేనే, అవి తక్కువ స్పీడ్లోనూ విమానాన్ని ఎక్కువ లిఫ్ట్ చేయగలవు” అని చెప్పారు.