ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వైద్యశాఖలో కొత్తగా 2,118 పోస్టులు

ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వైద్యశాఖలో కొత్తగా 2,118 పోస్టులు

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. వైద్యశాఖలో కొత్తగా 2 వేల118 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అల్లూరి జిల్లాలోని పాడేరు, వైయస్సార్ జిల్లాలోని పులివెందుల, కర్నూలు జిల్లాలోని ఆదోని మెడికల్ కాలేజీల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయించింది.

ఇందుకోసం ఒక్కోచోట మెడికల్ కాలేజీకి 222, బోధనాస్పత్రికి 484 చొప్పున కొత్తగా 2,118  పోస్టులను మంజూరు చేస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు  వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని  సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడం కోసం ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా వైద్య కళాశాలకు సంబంధించి అడిషనల్‌ డీఎంఈ హోదాలో ప్రిన్సిపాల్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్‌ సర్జరీ వంటి వివిధ విభాగాలు ఏర్పాటు, పరిపాలన విభాగాలకు సంబంధించిన పోస్టులను మంజూరు చేశారు.

ఇదిలావుండగా అన్నమయ్య జిల్లా మదనపల్లి, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేస్తున్న కొత్త వైద్య కళాశాలల్లో కూడా వచ్చే ఏడాది నుంచి అకడమిక్‌ కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంఈ డాక్టర్‌ నరసింహం చెప్పారు. కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణ పనులు ఈ రెండుచోట్ల వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో 2025–26కు బదులు 2024–25లో వీటిని అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ రెండు చోట్ల పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామన్నారు.