
అమరావతి: బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కొద్దిరోజుల కిందటే సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించగా సంబంధించిన ఉత్తర్వులు బుధవారం వెల్లువడ్డాయి. దీంతో ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. కాగా, కోవిడ్ నుంచి కోలుకున్న వారు బ్లాక్ ఫంగస్ వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 3, కర్నూలులో 2, అనంతపురంలో 2, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 1 చొప్పున కేసులు వెలుగుచూశాయి. ప్రభుత్వ నిర్ణయంతో బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఏర్పడింది.