
- అపెక్స్ కౌన్సిల్లో సరేనని సుప్రీంలో మోకాలడ్డు
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల దోపిడీని కొనసాగించేందుకు ఏపీ మరిన్ని అడ్డదారులు వెతుకుతోంది. కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలు తీరకుండానే పెన్నా బేసిన్కు నదిని మలుపుకుంటున్న ఆంధ్ర సర్కారు, నీళ్ల వాటాల మార్పులకు ప్రయత్నిస్తోంది. కృష్ణా నదిలో లభ్యమయ్యే నీటిని ప్రాజెక్టులవారీగా పంచేందుకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పోతోంది. ట్రిబ్యునల్ ఏర్పాటుకు అప్పుడు సరేనని, ఇప్పుడు సుప్రీంకోర్టులో మాత్రం భిన్నమైన వాదనలు వినిపించింది. కొత్త ట్రిబ్యునల్ వేసేముందు తమ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలని పట్టుబట్టింది. దీంతో ట్రిబ్యునల్ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యేలా కన్పిస్తోంది.
ఆర్నెల్ల తర్వాత విత్ డ్రా పిటిషన్
కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఎక్కువ భాగమున్న తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కలేదని, రాష్ట్రాల జల వివాదాల చట్టం (1956) ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 2015లో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేసు వేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల పునఃపంపిణీపై బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ వాదనలు వింటోంది. దీనికి బదులు ఐఎస్డబ్ల్యూఆర్ (1956) సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాలను ప్రాజెక్టులవారీగా పునఃపంపిణీ చేయాలని తెలంగాణ కోరుతోంది. ప్రధాని నరేంద్రమోడీ సహా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి తదితరులకు ఈ మేరకు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. గత అక్టోబర్ 6న రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగులోనూ సీఎం కేసీఆర్ కొత్త ట్రిబ్యునల్ కోసం పట్టుబట్టారు. అందులో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ కూడా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును వ్యతిరేకించలేదు. సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు అడ్డంకిగా ఉందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. దాన్ని వెనక్కు తీసుకుంటే ట్రిబ్యునల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మీటింగ్ మినిట్స్లోనూ ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకోవాలని కేంద్రం సూచించిన ఆర్నెల్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం మేల్కొని రిట్ పిటిషన్ వేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం వాదనలు విని పిటిషన్ వెనక్కు తీసుకోవడానికి అనుమతిచ్చింది. అయితే ఏపీ, కర్నాటక దీన్ని వ్యతిరేకించాయి. తమ వాదనలు వినకుండా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఒప్పుకోబోమన్నాయి. తాము తెలంగాణ పిటిషన్ విత్డ్రా చేసుకోవడానికి మాత్రమే అనుమతిచ్చామని, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆదేశాలేమీ ఇవ్వలేదని ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. ఏపీ, కర్నాటక అభ్యంతరాలను తమ ముందుంచాలని ఆదేశించింది.
బచావత్ కేటాయింపుల్ని రివ్యూ చేయొద్దట!
కేడబ్ల్యూడీటీ -1 లో జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను రివ్యూ చేయడానికి వీల్లేదని ఏపీ అడ్డంగా వాదిస్తోంది. కోస్తాంధ్ర, సీమలకు కలిపి 512 టీఎంసీ, తెలంగాణకు 299 టీఎంసీ నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిందని, కొత్త ట్రిబ్యునల్ వచ్చినా ఈ కేటాయింపులను సమీక్షించడానికి వీల్లేదని మొండి వాదaన చేస్తోంది. కానీ వాస్తవానికి కృష్ణాలో 75 శాతం డిపెండబిలిటీ దగ్గర 811 టీఎంసీలకు మించి నికర జలాలు లేవని ఇంజనీర్లు చెప్తున్నారు. అలాంటప్పుడు కొత్త ట్రిబ్యునల్ను వరద జలాల పంపిణీకే పరిమితం చేయాలనే ఏపీ వాదన సరికాదని అంటున్నారు. ‘‘ఉమ్మడి ఏపీలో తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా అదే అన్యాయం చేస్తే ఎలా?’’ అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచి త్వరగా ట్రిబ్యునల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఇంజనీర్లు సూచిస్తున్నారు.