బీహార్లో దోపిడీ దొంగలు తెగబడ్డారు. హాజీపూర్లోని జదుహా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బ్రాంచి నుంచి దుండగలు పట్టపగలు కోటి 19 లక్షల రూపాయలు లూటీ చేశారు. కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్ నివాసానికి సమీపంలోనే ఈ దోపిడీ ఘటన జరగడం గమనార్హం. ఇవాళ ఉదయం బ్రాంచి ప్రారంభమైన వెంటనే ఈ ఘటన జరిగింది.
బ్యాంకు తలుపులు తెరచిన కాసేపటికే బైక్పై వచ్చిన అయిదుగురు దుండగులు బ్యాంకులోకి వెళ్లారు. బ్యాంకులో తమ తమ సీట్లలో కూర్చుని పనులు చూసుకుంటున్న ఉద్యోగులను బెదిరించారు. అరచి.. అల్లరి చేసినా.. ఏ మాత్రం కదిలినా కనికరం లేకుండా కాల్చి చంపేస్తామని హెచ్చరించారు. బ్యాంకు లో ఉన్న క్యాష్ రూమ్ ను తెరిపించి అందులో ఉన్న నగదు. 1.19 కోట్లను తీసుకుని బయటకు వెళ్లారు. ఇద్దరు దుండగులు రెండు గోనె సంచి బస్తాల్లో డబ్బును భుజాలపై మోసుకుంటూ బ్యాంకులో నుంచి వెళ్లిపోయారు. చోరీ ఘటన సమీపంలోని సీసీటీవీల్లో రికార్డయింది.
దొంగలు వెళ్లిపోయిన కాసేపటికి అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులతో పాటు బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వచ్చిన పోలీసులు నిందితులు ఎటు వైపు వెళ్లింది ఆరా తీస్తూ హడావుడి చేయడంతో దోపిడీ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సీసీ కెమెరా ఫోటోలు బయటకు రావడం.. పట్టపగలు కేంద్ర మంత్రి నివాసానికి దగ్గరలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.