ఆసిఫాబాద్, వెలుగు: పోలీస్ రిక్రూట్మెంట్లో ఏజెన్సీ ప్రాంతాలకు 75 శాతం రిజర్వేషన్ కేటాయించాలని తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘాలు ఇచ్చిన ఏజెన్సీ బంద్ బుధవారం ఆసిఫాబాద్ జిల్లాలో సక్సెస్అయ్యింది. ఆసిఫాబాద్, కెరమెరి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యు), తిర్యాణి, వాంకిడి మండలాల్లో వ్యాపార, వాణిజ్య, ప్రైవేట్ స్కూళ్లు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.
జైనూర్, సిర్పూర్(యు) మండలాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తుడుందెబ్బ జాతీయ అధ్యక్షులు కొట్నాక్ విజయ్ కుమార్, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మధురాజ్ మాట్లాడుతూ.. గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో 75 శాతం రిజర్వేషన్ అమల్లో ఉండేదని గుర్తు చేశారు. ఆ రిజర్వేషన్ రద్దు కావడంతో ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన ఆదివాసీ యువత జనరల్ కేటగిరీలో పోటీపడలేక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీస్ రిక్రూట్మెంట్లో 75 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
