- ఆస్ర్టేలియాలోని సిడ్నీలో ఘటన
- శవం పాడవకుండా ఎయిర్ ఫ్రెషనర్లను ఉపయోగించిన నిందితుడు
సిడ్నీ: ఎవరినైనా చంపి మహా అయితే ఎన్ని రోజులు దాయగలరు..? ఓ నిందితుడైతే ఇంట్లో చొరబడిన దొంగను చంపి ఏకంగా 15ఏళ్లు భద్రంగా దాచాడు. శవం నుండి దుర్వాసన రాకుండా.. ఇరుగు పొరుగు వారు గుర్తించకుండా డజన్ల కొద్దీ ఎయిర్ ఫ్రెషనర్లను వాడాడు. నిజం నిప్పులాంటిది కదా. ఎప్పుడోఒకసారి దొంగతనం బయటపడాల్సిందేగా. అనుకున్నట్లే అయ్యవారి లీల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొలుత పోలీసులు కొద్ది రోజుల క్రితం చనిపోయిన శవం అని అనుమానించారు. అయితే డజన్ల కొద్దీ ఎయిర్ ప్రెషనర్లు కనిపించడం.. అవి చాలా కాలంగా వాడుతున్నట్లు ఆధారాలు లభించడంతో సైంటిఫిక్ ఆధారాలతో విచారించాక పోలీసులే ఆశ్చర్యపోయారు. మిస్టరీగా కనిపించడంతో ప్రత్యేక కోర్టులో విచారణ చేపట్టారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో బయటపడిన ఘటన సంచలనం రేపింది.
2002లో సిడ్నీకి చెందిన షేన్ స్నెల్మన్ బ్రూస్ రాబర్ట్స్ అనే వ్యక్తి ఇంట్లోకి దొంగతనానికి వెళ్లాడు. దొంగను చూసిన బ్రూస్ రాబర్ట్స్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చి చంపాడు. దొంగను చంపేశాక తాను ఎక్కడ జైలుకు వెళ్లాల్సి ఉంటుందోనని భావించి శవాన్ని 15 సంవత్సరాలుగా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. శవం నుంచి దుర్వాసన ప్రారంభమైన వెంటనే రకరకాల ఎయిర్ ఫ్రెషనర్ల వాడుతూ వస్తున్నాడు. ప్రత్యేక బాక్సులో పెట్టి.. వాసన రాకుండా తరచూ ఎయిర్ ఫ్రెషనర్లను ఉపయోగించాడు. ఆ తర్వాత 2017లో అతను కూడా చనిపోయాడు. హీటర్ పై పడి మరణించడంతో ఒంటరివాడైన అతడి అంత్యక్రియలను ఇరుగు పొరుగు వారే నిర్వహించారు. అయితే అతడు చనిపోయిన తర్వాత అతడి ఇంటిని చాలా కాలం ఎవరూ పట్టించుకోలేదు. ఏడాది తర్వాత ఇంటిని శుభ్రం చేస్తుండగా శవం ఆనవాళ్లు కనిపించాయి. పోలీసుల విచారణలో షేన్ స్నెల్ మన్ అనే దొంగ అస్తిపంజరంగా తేలింది. చాలా కాలంగా అతను కనిపించకుండా పోవడంతో పోలీసులకు అంతుచిక్కలేదు. అతని గురించి ఎంతగా విచారించినా ఆచూకీ లభించలేదు. చివరకు బ్రూస్ ఇంట్లో బయపటపడిన అస్తిపంజరం, అతని డ్రస్సు, ఇతర ఆనవాళ్లు అతడికి సరిపోలాయి. వ్యవహారం అంతా మిస్టరీ గా అనిపించడంతో ఇలాంటి మరణాలపై విచారించే "కరోనర్ కోర్టు" వాస్తవాలు వెలికితీసేందుకు పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలను జారీ చేసింది.