న్యూఢిల్లీ: ధరలు ఎక్కువగా ఉండటం (ఇన్ఫ్లేషన్), వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో సెప్టెంబరు క్వార్టర్లో గ్రామీణ ప్రాంతాల్లో సబ్బులు, షాంపూలు, బిస్కెట్ల వంటి ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) ప్రొడక్టులకు గిరాకీ తగ్గింది. ఈ పరిశ్రమకు ఆపరేటింగ్ వాతావరణం కఠినంగానే ఉంది. టీ, డిటర్జెంట్ వంటి మాస్ మార్కెట్ ఉత్పత్తుల విషయంలో చిన్న, ప్రాంతీయ/స్థానిక కంపెనీల నుంచి విపరీతమైన పోటీ ఉంటోంది. అయితే జూన్ క్వార్టర్లో మాత్రం ఈ కంపెనీలు భారీగా సంపాదించాయి.
హెచ్యూఎల్, ఐటీసీ, నెస్లే వంటి ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు గోధుమ, మైదా, చక్కెర, బంగాళాదుంప, కాఫీ మొదలైన కొన్ని వస్తువుల ధరలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. వర్షాలు లేకపోవడంతో గ్రామీణ డిమాండ్పై ఇన్ఫ్లేషన్ ప్రభావం చూపింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా "ధరలపై ప్రతికూల ప్రభావం" పడుతుందని నెస్లే ఇండియా కూడా తెలిపింది. వర్షాల లోటు వల్ల మొక్కజొన్న, చక్కెర, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిపై ప్రభావం ఉంటుందని, ధరలు పెరగవచ్చని నెస్లే ఇండియా పేర్కొంది. అయితే సెప్టెంబర్ క్వార్టర్లో పట్టణ మార్కెట్లో అమ్మకాలు బాగానే ఉన్నాయని ఈ సంస్థలు తెలిపాయి. ఆధునిక కమర్షియల్ ఛానెల్స్, పెద్ద ప్యాక్లు ఎక్కువగా కొనడం ఇందుకు కారణాలు. ఎఫ్ఎంసీజీ తయారీదారులకు ఈ–కామర్స్ కూడా ఎంతో మేలు చేస్తోంది.