
శాయంపేట, వెలుగు: ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం ఆయన హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసి, లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఇందులో భాగంగా వసంతాపూర్లో హనుమకొండ జిల్లా హౌసింగ్ పీడీ రవీందర్, శాయంపేట ఎంపీడీవో ఫణిచందర్పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినప్పుడు ప్రణాళికా ప్రకారం పనులు పూర్తి చేయించాలని ఖాళీగా కూర్చుంటే సరిపోదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, భూపాలపల్లి మండలం మోరంచపల్లి, నాగారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల శిలాఫలాకాల ధ్వంసం, ఇతర ఇన్సిడెంట్ల నేపథ్యంలో ఎమ్మెల్యే శాయంపేట మండల పర్యటన సందర్భంగా శాయంపేట, పరకాల, దామెర, ఆత్మకూర్ మండలాలకు సంబంధించిన పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీవో రంజిత్, ఏవో గంగాజమున, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, పరకాల మార్కెట్వైస్ చైర్మన్మారపల్లి బుజ్జన్న తదితరులు పాల్గొన్నారు.