కేసీఆర్ ఇంట గెలవకుండా రచ్చ కెళ్తున్నారు

కేసీఆర్ ఇంట గెలవకుండా రచ్చ కెళ్తున్నారు

సీఎం కేసీఆర్ ఇంట గెలవకుండా రచ్చకెళ్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ పదిసార్లు బతిమాలినా బిహార్ సీఎం నితీష్ కుమార్ కూర్చోలేదని తెలిపారు. నితీశ్ కుమార్, కేసీఆర్ ను పట్టించుకోలేదని.. కేసీఆర్ తెలంగాణ పరువు తీశారన్నారు. బిహార్ పర్యటనతో కేసీఆర్ అబాసు పాలయ్యారన్నారు. తెలంగాణలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే కేసీఆర్ బిహార్ పర్యటనకు వెళ్లారని తెలిపారు. నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు కనిపిస్తుందన్నారు. రాహుల్ గాంధీ మీ నాయకుడా..?  ఎవరు మీ నాయకుడు అంటే కూర్చొని మాట్లాడుకుంటం అన్నారని చెప్పారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పదే పదే కూర్చోమని బ్రతిమిలాడే పరిస్థితి కేసీఆర్ కు వచ్చిందన్నారు.

గల్వాన్ లోయలో చనిపోయిన వారికి సహాయం చేస్తే తప్పు లేదన్న లక్ష్మణ్.. తెలంగాణలో చనిపోయిన వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ ఎందుకు ఆదుకోవడంలేదని నిలదీశారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ పట్టించుకోవడంలేదని సీరియస్ అయ్యారు. ప్రగతి భవన్, ఫాంహౌస్ కే పరిమితమైన కేసీఆర్ అదే ప్రపంచమనుకుంటున్నారని విమర్శించారు. ఇప్పుడు దేశ రాజకీయమంటూ కొత్త నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. మునుగోడు భయం కేసీఆర్ కు బాగా పట్టుకుందని లక్ష్మణ్ తెలిపారు. కూరగాయల ధరలు పెరుగుతున్నాయంటున్న సీఎం కేసీఆర్.. మన రాష్ట్రానికి కూరగాయలు పక్క రాష్ట్రాల నుంచి వస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.  క్యాబేజీ కర్ణాటక నుంచి, టమాట, బెండకాయలు ఏపీ నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

బీజేపీతో టీడీపీ పొత్తు  అని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తో కలసి పోటీ చేస్తుందని.. రోజురోజుకు అక్కడ బీజేపీ బలం పెరుగుతుందన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తుపై ఎలాంటి చర్చలు కూడా జరగడం లేదని తెలిపారు.