ప్రసాద్ స్కీమ్తో భద్రాద్రి అభివృద్ధి : మాధవీలత

ప్రసాద్ స్కీమ్తో భద్రాద్రి అభివృద్ధి : మాధవీలత
  •   బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవీలత 

భద్రాచలం, వెలుగు : భద్రాద్రి రామునికి అంతర్జాతీయ ఖ్యాతి కోసం బీజేపీ కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవీలత అన్నారు. భద్రాచలంలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనల మహాకూటమి సర్పంచ్​ అభ్యర్థి హరిశ్చంద్రనాయక్​  ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.  భద్రాచలంకు రెండు రైల్వే లైన్లు, ప్రసాద్​ నిధులు ఇచ్చి కేంద్రంలోని బీజేపీ సర్కారు రామునిపై ఉన్న ప్రేమను చాటుకుందన్నారు.

 గతంలో పదేండ్ల పాలించిన బీఆర్​ఎస్​ భద్రాద్రి రాముడిని విస్మరించిందని ఆరోపించారు. కనీసం కల్యాణ తలంబ్రాలు తేవడానికి కూడా కేసీఆర్ మనస్సు అంగీకరించలేదన్నారు. అటువంటి బీఆర్​ఎస్​కు పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రామాలయ అభివృద్ధికి ప్రకటించిన నిధుల్లో పైసా ఇవ్వని బీఆర్​ఎస్​ను ఓడించాలని పిలుపునిచ్చారు.

 రూ.1028కోట్లు కేంద్రం నిధులు ఇస్తే రూ.612 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తీరును ఆమె ప్రశ్నించారు. బీజేపీ సర్కారు భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు ఎయిర్​పోర్టును ప్రకటిస్తే కనీసం భూమిని కేటాయించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. పాండురంగాపురం-సారపాకల మధ్య రైల్వే లైను కోసం భూమి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని, రూ.3,592 కోట్లతో మోదీ సర్కారు మల్కన్​గిరి నుంచి పాండురంగాపురం వరకు రైల్వే లైనును మంజూరు చేసిందని తెలిపారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రప్పించి, భద్రాచలంలో రూ.93కోట్లతో ప్రసాద్​ స్కీం ద్వారా రామాలయం అభివృద్ధికి బీజేపీ సర్కారు కృషి చేస్తోందన్నారు. భద్రాచలం అభివృద్ధిలో కేవలం టీడీపీ సర్కారు కృషే ఉందని గుర్తు చేశారు. కరకట్ట, సెంట్రల్​ లైటింగ్​ సిస్టం, రహదారులు, బ్రిడ్జిల నిర్మాణంలో ఏజెన్సీ అభివృద్ధికి టీడీపీ చేసిన  పనులు మలుపు తిప్పాయని వివరించారు.అనంతరం భద్రాచలంలో ర్యాలీ నిర్వహించి మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.