ఉత్తరప్రదేశ్ -కాసేపట్లో పెళ్లనగా వరుడు పరారయ్యాడు.ఈ సంఘటన గురువారం యూపీలోని, కాన్పూర్ జిల్లా.. మహరాజ్ పూర్ లో జరిగింది. సీని ఫక్కీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పెండ్లి కొడుకుకు ఆ పెండ్లి ఇష్టం లేదు. కానీ తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పలేకపోయాడు. అందుకే వేదిక మీదకు వచ్చి పీటలపై కూర్చున్నాడు. వధూవరులు దండలు కూడా మార్చుకున్నారు. తీరా తాళి కట్టే సమయానికి పెండ్లి కొడుకు మాయమయ్యాడు. కాసేపు అతని కోసం వెతికిన ఇరు కుటుంబాలవారు పెండ్లి ఇష్టం లేకనే అతను పారిపోయినట్లు తెలుసుకున్నారు.
వరుడు పారిపోయి వధువు ఒక్కతే పెండ్లి పీటలపై ఉండటాన్ని వధువు తరఫు బంధువులు అవమానంగా భావించారు. అందుకే ఇంతదాకా వచ్చిన పెండ్లిని ఆపకూడదనే ఉద్దేశంతో పెండ్లికి వచ్చిన అతిథుల్లో ఎవరైనా వధువును చేసుకునేందుకు సుముఖంగా ఉన్నారా అని ఆరా తీశారు. ఓ వ్యక్తి పెండ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడు. దాంతో ఇరుకుటుంబాల వారు మాట్లాడుకుని అదే వేదికపై పెండ్లి జరిపించారు.