బోనాలను ప్రభుత్వ పండుగల జాబితాలో చేర్పిస్తా

బోనాలను ప్రభుత్వ పండుగల జాబితాలో చేర్పిస్తా

బోనాల పండుగను ప్రభుత్వ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన.. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలలో పాల్గొన్నారు. అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘దేశంలో ఎక్కడాలేని విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. పంటలను రక్షించాలని, రోగాల నుంచి ప్రజలను రక్షించాలని అమ్మవారిని కోరుతూ ఈ వేడుకలు జరుగుతాయి. గత ఏడాది నుంచి కరోనా కారణంగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం లేకపోయింది. సాధారణ పరిస్థితుల్లో భారీ ఎత్తున మహిళలు, ప్రజలు పాల్గొంటూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం తరఫున, ప్రధాని తరఫున రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించాలని, కరోనాపై పోరులో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నా’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.