
- అట్లయితే అవినీతి తగ్గుతది:ఏపీ సీఎం చంద్రబాబు
- కడపలో మహానాడు షురూ
హైదరాబాద్, వెలుగు: పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో అవినీతిని తగ్గించవచ్చని, డిజిటల్ కరెన్సీ వచ్చాక పెద్ద నోట్లు అవసరం లేదని పేర్కొన్నారు. మంగళవారం ఏపీలోని కడపలో మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘పార్టీ పని అయిపోయిందని మాట్లాడినోళ్ల పనే అయిపోయింది. 43 ఏండ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను ఎదుర్కొన్నాం. పాలనంటే హత్యా రాజకీయాలు, కక్షసాధింపులు అన్నట్టుగా గత ప్రభుత్వం మార్చేసింది.
దీన్ని ప్రశ్నించిన తెదేపా కార్యకర్తల ప్రాణాలు తీసింది. కానీ ఎత్తిన జెండా దించకుండా మీరంతా పోరాటం చేశారు. మన కార్యకర్త చంద్రయ్య.. పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తున్నది’’ అని అన్నారు.