సినీ ప్రపంచంలో వెండితెరపై మెరిసే తారలు మనకు కేవలం నటులుగానే తెలుసు. కానీ ఆ రంగుల ప్రపంచానికి ఆవల కొందరు సెలబ్రిటీలు అక్షరాలా రియల్ లైఫ్ హీరోలు అనిపించుకుంటారు. అచ్చం అలాగే, తన నటనతోనే కాదు.. తనలోని అపారమైన మానవత్వంతో ఒక పసిప్రాణాన్ని కాపాడి.. అందరి హృదయాలను గెలుచుకుంది నటి శృతి హాసన్. ప్రస్తుతం శృతి అందించిన ఆపన్నహస్తం అందరి ప్రశంసలు అందుకుంటుంది.
అరుదైన వ్యాధితో చిన్నారి...
చెన్నైకి చెందిన 'ఆళ్వి' అనే చిన్నారి 2023లో జన్మించింది. అయితే పుట్టిన కొద్ది నెలలకే ఆ పాపకు ఎంఎస్ఎమ్డీ (MSMD – Mendelian Susceptibility to Mycobacterial Diseases) అనే అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పూర్తిగా దెబ్బతీస్తుంది. 2025 నాటికి పాప పరిస్థితి విషమించింది. ప్రాణాలు నిలవాలంటే 'బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్' తప్పనిసరి అని వైద్యులు తేల్చి చెప్పారు. ఖరీదైన వైద్యం, అరుదైన వ్యాధి కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు ఆ చిన్నారి తల్లిదండ్రులు .
ALSO READ : బన్నీతో 'ధురంధర్' డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్..
దైవం పంపిన దూతలా..
సరిగ్గా అదే సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచింది శృతి హాసన్. కేవలం ఆర్థిక సాయం చేసి చేతులు దులుపుకోకుండా, పాపకు అత్యుత్తమ వైద్యం అందేలా స్వయంగా రంగంలోకి దిగింది. దేశంలోని టాప్ స్పెషలిస్టులతో మాట్లాడింది. డాక్టర్ ధరణి, డాక్టర్ దివ్య వంటి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స జరిగేలా చూసింది. పాప ఐసీయూలో ఉన్న సమయంలో శృతి, ఆమె టీమ్ నిరంతరం టచ్లో ఉంటూ ఆ కుటుంబానికి మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. చికిత్స విజయవంతమై, ప్రాణాపాయం నుంచి చిన్నారి ఆళ్వి బయటపడింది.
ఆ చిన్నారి ఇటీవల తన తల్లిదండ్రులతో కలిసి శృతి హాసన్ను కలిసింది. ఈ సందర్భంగా శృతి ఆ పాపతో ఆడుకుంటూ, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి నవ్వించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "మా పాప ఈరోజు ప్రాణాలతో ఉందంటే దానికి కారణం శృతి గారే. ఆమె మా పాలిట దేవుడు పంపిన దూత. ఆమె కైండ్నెస్ చూస్తుంటే ఒక సెలబ్రిటీని కలిసినట్లు కాకుండా, మా కుటుంబ సభ్యురాలిని కలిసినట్లు అనిపించింది అని ఆ తల్లిదండ్రులు ఎమోషనల్ అయ్యారు.
ALSO READ : చెడిపోవడానికి సమయం వచ్చింది.. ‘ధురంధర్ 2’ టీజర్ భీభత్సం..
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా..
ఒకవైపు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తున్న శృతి, కెరీర్ పరంగా కూడా ఫుల్ ఫామ్లో ఉంది. రజనీకాంత్ తో కలిసి నటించిన' కూలీ' (Coolie) చిత్రం 2025లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'ట్రైన్' (Train) త్వరలో విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్ సరసన నటిస్తున్న పీరియడ్ డ్రామా 'ఆకాశంలో ఒక తార'పై భారీ అంచనాలు ఉన్నాయి. మరో వైపు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్.ఎస్. రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్ వస్తున్న చిత్రం 'వారణాసి' (Varanasi) . ఈ మూవీలో శృతి హాసన్ ఒక కీలకమైన పాటను పాడటమే కాకుండా, ఒక స్పెషల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ ఉన్నప్పటికీ, ఏమాత్రం గర్వం లేకుండా ఒక సామాన్య కుటుంబానికి ఆపన్నహస్తం అందించిన శృతి హాసన్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ALSO READ : టాలీవుడ్ను షేక్ చేయనున్న ‘ధురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్..
