- అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజాప్రతినిధులకు సూచన
- చనాఖా, కోరాటాకు రాంచందర్రెడ్డి, సదర్మాట్కు నర్సారెడ్డి పేర్లు
- సీఎం సభ సక్సెస్ తో పార్టీ శ్రేణుల్లో జోష్
నిర్మల్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలకు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. స్థానిక ప్రజాప్రతినిధులు అడిగిన అన్నింటికీ సీఎం ఓకే చెప్పడంతో సంబురాల్లో మునిగిపోయారు. కాంగ్రెస్ప్రజాప్రతినిధులే కాకుండా బీజేపీ వాళ్లు చేసిన సూచనలపై సీఎం సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బహిరంగ సభావేదికపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పలు అంశాలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా వీటిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ ప్రజల కోరిక మేరకు బాసర ట్రిపుల్ఐటీలో నూతన యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలంటూ వేదికపై నుంచే ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణరావుకు సీఎం సూచించారు. నిర్మల్లో ఏటీసీ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. బాసరలో యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో అన్ని ప్రాంతాల నాయకులు, మేధావులు, విద్యావంతులు సలహాలు, సూచనలు తీసుకోవాలని చెప్పారు.
పాలమూరు జిల్లాకు ఎలా నిధులు ఇస్తున్నానో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కూడా పెద్ద మొత్తంలో నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఏండ్ల నుంచి నిలిచిపోయిన కాళేశ్వరం 27వ నంబర్ ప్యాకేజీ కాలువకు నిధులు ఇస్తానన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దేశంలోనే ఎక్కడాలేని విధంగా అతి పెద్ద పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని, దీని కోసం 10 వేల ఎకరాల భూమిని సేకరిస్తామని సీఎం తెలిపారు. కాలువలు, లిఫ్ట్ ఇరిగేషన్ ఆధునీకరణకు సైతం నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. సదర్మాట్ బ్యారేజీ, చనాఖా కోరటా బ్యారేజీలను ప్రారంభించడమే కాకుండా యాసంగి పంటలకు ఈ బ్యారేజీల నుంచి నీటిని విడుదల చేయడంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.
చనాఖా, కోరాటాకు రాంచందర్రెడ్డి, సదర్మాట్కు నర్సారెడ్డిల పేర్లు..
స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల మేరకు సదర్మాట్బ్యారేజీకి మాజీ ఇరిగేషన్మంత్రి నర్సారెడ్డి పేరు, చనాఖా కోరాటా బ్యారేజీకి మాజీ మంత్రి రాంచందర్రెడ్డి పేర్లు పెడుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రిగా పని చేసిన రాంచంద్రారెడ్డి ఇరిగేషన్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన హయాంలో ఈ బ్యారేజీకి రూపకల్పన జరిగిందని, నిర్మల్ జిల్లాకు చెందిన నర్సారెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్గా, రెవెన్యూ, ఇరిగేషన్ మంత్రిగా పని చేశారని, ఆయన హయాంలోనే స్వర్ణ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.. సీఎం దృష్టికి తీసుకెళ్లాడు.
దీంతో సీఎం వేదికపైనే వారి బ్యారేజీలకు నామకరణం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నిర్మల్ పట్టణానికి దూరంగా ఉన్న కొత్త కలెక్టరేట్ను అక్కడి నుంచి తరలించాలని, పట్టణ నడిబొడ్డున నిర్మించాలంటూ అధికారులను ఆదేశించారు. కొత్త కలెక్టరేట్, స్టేడియం నిర్మాణంపై ఫిబ్రవరి మొదటి వారంలోగా సమీక్ష నిర్వహించి భూసేకరణ తదితర అంశాలపై దృష్టి సారించాలంటూ ఇన్చార్జి మంత్రి జూపల్లికి సీఎం సూచించారు.
సీఎం టూర్ సక్సెస్..
జిల్లాలో సీఎం రేవ్ంత్ రెడ్డి టూర్ సక్సెస్కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది. మున్సిపల్ఎన్నికల నేపథ్యంలో సీఎం పర్యటన కాంగ్రెస్కు కలిసి వస్తుందని సంబుర పడుతున్నారు. స్థానికుల డిమాండ్లను అన్నింటినీ ముందుగానే తెలుసుకున్న సీఎం వేదికపైనే హామీలిచ్చి ప్రజలను ఆకట్టుకున్నారు. జిల్లా అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు కలిసోచ్చే అవకాశం ఉందని స్థానిక నాయకులు భావిస్తున్నారు.
