- సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఫండ్స్ రిలీజ్ చేసిన మున్సిపల్ శాఖ
- ప్రాధాన్యతాక్రమంలో అభివృద్ధి పనులకు వాడుకోవాలని సూచన
మహబూబ్నగర్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.370 కోట్ల నిధులు విడుదల చేసింది. మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసి తొమ్మిది నెలలు పూర్తి కాగా, ఇన్చార్జీల పాలన కొనసాగుతోంది. అయితే నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గతంలో 19 మున్సిపాలిటీలు ఉండగా.. కొద్ది రోజుల కిందట మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా, గ్రేడ్–1 మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది.
దీంతో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా అప్గ్రేడ్ కాగా.. మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట జిల్లాలోని మద్దూరు మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 20కి చేరగా.. ఒక కార్పొరేషన్ ఏర్పాటైంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది.
నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు..
పట్టణాలు, నగరాల్లో డెవలప్మెంట్ వర్క్స్ చేపట్టేందుకు నిధులు విడుదల చేయాలని మున్సిపల్ శాఖకు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ శాఖ కొత్త, పాత మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఆయా మున్సిపాలిటీలకు చేరాయి. అయితే ఇటీవల మున్సిపాలిటీల్లోకి విలీనం అయిన గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు చేయడానికి అదనంగా నిధులు కేటాయించింది.
మహబూబ్నగర్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉండగా, నాగర్కర్నూల్లో 4, వనపర్తిలో 5, గద్వాలలో 4, నారాయణపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలకు రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు కేటాయించింది. కార్పొరేషన్కు రూ.30 కోట్లు రిలీజ్ చేయగా, నగరాభివృద్ధి, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్(యూఐడీఎఫ్) నుంచి ఈ నిధులను మంజూరు చేసింది. ఈ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని 20 మున్సిపాలిటీలతో పాటు పాలమూరు కార్పొరేషన్కు రూ.370 కోట్లు
విడుదలయ్యాయి.
ప్రయారిటీ పనులకే నిధులు..
మున్సిపాలిటీలకు భారీగా నిధులు విడుదల చేసిన సర్కారు, ఈ ఫండ్స్ను ప్రయారిటీ పనులకు మాత్రమే వినియోగించాలని సంబంధిత శాఖ నుంచి మున్సిపాలిటీలకు ఆదేశాలు వచ్చాయి. నగరాలు, పట్టణాల్లో ప్రధాన సమస్యలైన రోడ్లు, డ్రైనేజీలు, అండర్ డ్రైనేజీలు, సైడ్ డ్రైన్లు, ఓపెన్ జిమ్లు, మినీ జిమ్లు, ప్లే గ్రౌండ్స్, చిన్న పిల్లల పార్కులు, ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు కోసం ఎస్టిమేషన్లు తయారు చేసి నిధులు కేటాయించాలని సూచించారు.
అలాగే ఈ పనులకు తర్వరలో టెండర్లు ఆహ్వానించి, వచ్చే మార్చి లోపు పనులు పూర్తి చేసేలా డెడ్లైన్ విధించినట్లు తెలిసింది. ఈక్రమంలో సంబంధిత ఆఫసీర్లు ఎక్కడెక్కడ ఏ పనులు చేపట్టాలనే వివరాలు సేకరిస్తున్నారు. కొత్తగా చేపట్టబోయే పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పేపర్ వర్క్ పూర్తి చేసి వచ్చే వారం టెండర్లు పిలిచే అవకాశం ఉంది. కాగా, గతంలో ప్రారంభించి నిధులు లేక మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి పనులను కూడా టేకప్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
