
- కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
ఆర్మూర్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని, ఆర్థిక స్థోమత లేనివారికి రుణాలు ఇప్పించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆర్మూర్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడిన అనంతరం మున్సిపల్ లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, వనమహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
183 ఇండ్లు మాత్రమే గ్రౌండింగ్..
ఆర్మూర్ లో 617 మందికి ఇండ్లు మంజూరు కాగా, కేవలం 183 గ్రౌండింగ్ జరిగాయని, మిగతావి ఎందుకు కాలేదని అధికారులపై కలెక్టర్ ఆగ్రహించారు. మెప్మా ఆధ్వర్యంలో రుణాలు ఇప్పించాలని, మహిళా సంఘాల్లో సభ్యులుగా లేనివారిని చేర్పించి రుణాలు ఇప్పించాలన్నారు. వారంలో మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో స్పష్టమైన ప్రగతి కనిపించాలన్నారు. వనమహోత్సవం విజయవంతమయ్యేలా కృషి చేయాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కేటాయించేలా అర్హుల జాబితాను రూపొందించాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పోర్టల్ లో లబ్ధిదారుల వివరాలు అప్డేట్ చేయాలన్నారు. జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో రోడ్ భద్రతా జిల్లా కమిటీ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఆయా శాఖలు సమన్వయంతో వెళ్తే ఫలితాలు సాధించే వీలుందన్నారు. రోడ్డు ఆక్రమణలను నివారించాలని, వడ్లు, మొక్కజొన్న తదితర పంటలను రోడ్లపై ఆరబెట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయన్నారు.
బ్లాక్ స్పాట్స్ గుర్తింపుతో ప్రయోజనం
జిల్లాలోని నేషనల్ హైవే 44, 63 పై యాక్సిడెంట్స్ అవుతున్నాయని సీపీ సాయి చైతన్య అన్నారు. బ్లాక్ స్పాట్స్ గుర్తించి తీసుకున్న చర్యలతో పరిస్థితి కొంత మారిందన్నారు. మూల మలుపులు, కల్వర్టులు, ఎత్తుపల్లాలు, రోడ్ నిర్మాణ లోపాలు యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయని సైన్ బోర్డులు, లైటింగ్తో నివారించవచ్చన్నారు. టౌన్ ఏరియాలో ట్రాఫిక్ కంట్రోలింగ్ పెంచుతామన్నారు.