- సుప్రీంకోర్టుకు తెలియజేసిన కేంద్రం
న్యూఢిల్లీ: కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. తన నిర్ణయాన్ని ఇవాళ సుప్రీం కోర్టుకు తెలియజేసింది. పరిహారం మొత్తాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) సిఫారసు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ ద్వారా బాధితుల కుటుంబాలకు అందజేస్తామని వివరించింది.
కరోనాతో తమ కుటుంబీకులను కోల్పోయిన కుటుంబాల వారు ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని పొందాలంటే తమ వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. కరోనాతో మృతి చెందిన సర్టిఫికెట్ జారీ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మార్గదర్శకాలు ప్రకటించిన విషయం తెలిసిందే.