- సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోస్గి మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్
- నారాయణపేటలో హంగ్, క్యాంప్నకు బీజేపీ కౌన్సిలర్లు
మహబూబ్నగర్/నారాయణపేట/వనపర్తి/గద్వాల/, నాగర్కర్నూల్/ మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: అధికార కాంగ్రెస్ పార్టీ ‘పుర’ పోరులో సత్తా చాటింది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోని మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా.. జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం కొంత వెనుకబడింది. మిగతా చోట్ల అధికారాన్ని చేజిక్కించుకొని పుర పీఠాలపై కాంగ్రెస్ జెండాను ఎగురవేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 18 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్కు ఎన్నికలు జరుగగా.. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో 12 చోట్ల పైచేయి సాధించింది.
11 మున్సిపాల్టీల్లో వార్ వన్ సైడ్..
ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో అధికార పార్టీ విజయం సాధించగా.. 11 చోట్ల ఏకపక్షంగా పుర పీఠాలను దక్కించుకుంది. ఒక్క దేవరకద్ర మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నడవగా.. కాంగ్రెస్ ఆరు, బీఆర్ఎస్ నాలుగు, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్(కాంగ్రెస్ రెబల్) ఒకరు గెలుపొందారు. అయితే హంగ్ ఏర్పడుతుందని అందరూ భావించగా.. సాయంత్రం ఇండిపెండెంట్గా గెలిచిన అభ్యర్థి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డిని వెళ్లి కలిశారు. అనంతరం కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో అధికార పార్టీ పుర పీఠాన్ని కైవసం చేసుకుంది. మిగతా 11 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.
కొన్ని మున్సిపాలిటీల్లో ఈ రెండు పార్టీలు సింగిల్ డిజిట్కే పరిమితం కాగా.. కోస్గి, మద్దూరు, పెబ్బేరు, నాగర్కర్నూల్, కొల్లాపూర్, అలంపూర్, వడ్డేపల్లి, అయిజ పురపాలికల్లో బీజేపీ ఖాతా కూడా తెరవలేదు. నారాయణపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగగా కోస్గి, మద్దూరు, మక్తల్, మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, భూత్పూర్, నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, పెబ్బేరు, కొత్తకోట, వనపర్తి మున్సిపల్ పీఠాలను కాంగ్రెస్ దక్కించుకుంది.
జీఎంఆర్ వన్ మెన్ షో..
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి వన్ మెన్ షో ప్రదర్శించారు. ఆయన నియోజకవర్గంలోని దేవరకద్ర, భూత్పూర్, కొత్తకోట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అయితే ప్రతిపక్షాలు కాంగ్రెస్ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డాయి. చివరకు లోపాయి'కారు' ఒప్పందాలు చేసుకున్నా ఫలితాలను రాబట్టలేకపోయాయి. ఈ మున్సిపాలిటీల్లో పోలింగ్ ఒక రోజు ముందు వరకు ఆ రెండు పార్టీలకు చెందిన లీడర్లు చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతూ.. తామే గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. పోలింగ్ రోజు పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసినా చివరకు ఓటర్లు భిన్నమైన తీర్పు ఇవ్వడంతో నిరాశలో మునిగిపోయారు.
మక్తల్లోనూ కాంగ్రెస్సే..
పోలింగ్కు ఒక రోజు ముందు మక్తల్ మున్సిపాల్టీలోని ఆరో వార్డుకు చెందిన బీజేపీ క్యాండిడేట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణమని బీజేపీ లీడర్లు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికితోడు ఈ మున్సిపాల్టీలోనూ లోపాయి ‘కారు’ ఒప్పందాలు చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. కానీ, ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. మెజార్టీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని అందరూ భావించగా.. ఏకపక్షంగా ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మంత్రి వాకిటి శ్రీహరి మూడు రోజులుగా స్థానికంగానే ఉంటూ.. కాంగ్రెస్ గెలుపులో కీ రోల్ పోషించారు.
పాలమూరు, నారాయణపేటలో ఖాతా తెరవని బీఆర్ఎస్..
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లోని మద్దూరు, కోస్గి, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో ఒక్క చోట కూడా బీఆర్ఎస్ చైర్మన్ పీఠాలను దక్కించుకోలేదు. తాజా ఎన్నికల్లో బీజేపీ నారాయణపేట పీఠాన్ని కైవసం చేసుకొనే ప్రయత్నం జరుగుతుండగా, గతంలో సిట్టింగ్ స్థానంలో ఉన్న మక్తల్ పీఠాన్ని బీఆర్ఎస్ చేజార్చుకుంది.
నడిగడ్డలో రసవత్తర పోరు
గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులు ఉండగా కాంగ్రెస్ కు 16, బీఆర్ఎస్ కు 11, బీజేపీ 7, ఇండిపెండెంట్ అభ్యర్థులు రెండు చోట్ల, ఎంఐఎం అభ్యర్థి ఒకచోట గెలుపొందారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు ఎంఐఎం కౌన్సిలర్ తో కలిపి చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
క్యాంప్నకునారాయణపేట బీజేపీ కౌన్సిలర్లు
నారాయణపేట జిల్లాలో హంగ్ ఏర్పడింది. ఈ మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా, 11 వార్డుల్లో బీజేపీ, ఏడు వార్డుల్లో కాంగ్రెస్, రెండు వార్డుల్లో బీఆర్ఎస్, రెండు వార్డుల్లో ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్బీ) ఒకటి, ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ 13 స్థానాలు కావడంతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఇండిపెండెంట్గా గెలిచిన కౌన్సిలర్ బీజేపీకి రెబల్గా పోటీ చేశాడు. ఈయన ఆ పార్టీకే మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. అలాగే బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు కౌన్సిలర్ల మద్దతును కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారభించింది. ఆ పార్టీ నుంచి గెలిచిన 11 మంది కౌన్సిలర్లు చేజారిపోకుండా ఫలితాలు వెల్లడైన వెంటనే బీజేపీ క్యాంపునకు తరలించింది. కాంగ్రెస్కు ఎంఐఎం మద్దతు తెలుపడంతో మిగతా ఐదు మంది మద్దతును కూడగట్టేందుకు చర్చలు ప్రారంభించింది.
