
హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టబోతుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 16న హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది AICC. మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీడబ్ల్యూసీ మొదటిసారి భేటీ అవుతుంది. హైదరాబాద్ CWC మీటింగ్ కు సంబంధించిన వివరాలు ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.
సెప్టెంబర్ 17వ తేదీన CWC సభ్యులతో పాటు, అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నామని కేసీ వేణుగోపాల్ తెలిపారు. అలాగే సెప్టెంబరు 17 న సాయంత్రం హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మీటింగ్ కు కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు హాజరు కానున్నారని వెల్లడించారు. ఇదే వేదికగా తెలంగాణలో అమలు చేయబోయే 5 గ్యారంటీ హామీలు ప్రకటించనున్నామని తెలిపారు. సెప్టెంబరు 18 నుండి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ 5 గ్యారంటీలతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్ షీట్ లతో ఇంటింటి ప్రచారం చేస్తారని చెప్పారు.