
హైదరాబాద్, వెలుగు : ఏపీ, తెలంగాణ విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఆలిండియా సర్వీస్ ఆఫీసర్ల నియామకాలు జరిగాయని, ఈ వ్యవహారంపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్) ఆదేశాలు చెల్లవని హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదించింది. క్యాట్ ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ మరో 15 మంది కేంద్ర సర్వీస్ ఆఫీసర్లను ఏపీకి పంపాల్సిందేనని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్రెడ్డి వాదించారు. క్యాట్ ఉత్తర్వులను రద్దు చేయాలని కేంద్రం దాఖలు చేసిన పలు పిటిషన్లపై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.
తీర్పును రిజర్వులో పెడుతున్నట్లు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాడర్ కేటాయింపులపై పూర్తి అధికారం కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ)కే ఉందని సూర్యకరణ్రెడ్డి చెప్పారు. అయితే, ఆ కేటాయింపులను క్యాట్ సవాల్ చేసి తెలంగాణలో కొనసాగుతున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ను ఏపీకి పంపాల్సిందేనని చెప్పారు. క్యాడర్ కేటాయింపులపై వేసిన ప్రత్యుష్సిన్హా సారథ్యంలోని కమిటీలో ఉమ్మడి ఏపీ చివరి చీఫ్ సెక్రటరీ పీకే మహంతి సభ్యుడిగా ఉన్నారని, అఖిల భారత సర్వీసు అధికారైన తన కుమార్తెకు మేలు చేకూర్చేందుకే పీకే మహంతి ఉత్తర్వులు ఇచ్చారన్న సోమేశ్ కుమార్ చేసే ఆరోపణలకు ఆధారాలు లేవన్నారు. కేంద్రం వాదనలు కూడా పూర్తి కావడంతో హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది.